బంగారం.. అసలు భూమిలోకి ఎలా వచ్చిందో తెలుసా?
వాషింగ్టన్: భూమ్మీద విలువైన వాటిలో బంగారం.. కూడా ఒకటి. బంగారం పేరు చెబితే చాలు మహిళలు పడి చచ్చిపోతారు. చెవులు, ముక్కు.. చేతులు, మెడ... ఇలా ఎక్కడపడితే అక్కడ దాన్ని ఆభరణాల రూపంలో అలంకరించుకుంటారు.
అయితే ఇంత విలువైన ఈ లోహం అసలు మన భూమిలోకి ఎలా వచ్చి చేరిందో తెలుసా? బంగారం ఇతర విలువైన లోహాలు భూమి లోపల ఏలా ఏర్పడ్డాయనే దానిపై రకరకాల పరిశోధనలు, సిద్ధాంతాలు ఉన్నాయి.
అయితే తాజా పరిశోధన ఒకటి వీటికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో సౌత్వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్కు చెందిన బృందం బంగారంపై పరిశోధనలు చేపట్టింది.
భూ గ్రహం ఏర్పడే సమయంలో చంద్రుడు అంత సైజులో ఉన్న ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయిందట. ఆ తర్వాత అది భూమి అంతర్భాగంలో పలు ప్రక్రియలకు గురవడం వల్ల బంగారం, ప్లాటినం వంటి లోహాలు ఉద్భవించాయని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
'బంగారం, ప్లాటినంలాంటి విలువైన లోహాల ఆవిర్భావంలో భారీ శకలాలు భూమిని ఢీకొట్టే పాత్రను మా పరిశోధనలు విశదీకరించాయి..' అని అమెరికాలోని సౌత్వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు సిమోన్ మార్చి వెల్లడించారు.
గతంలో అంచనా వేసినదానికంటే భూమి లోపల ఉన్న లోహాల పరిమాణం రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశోధన వివరాలు నేచర్ జియోసైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.