గ్రహాంతర వాసుల ఆచూకీ లభించిందా? డిసెంబర్ 14న ‘నాసా’ కీలక ప్రకటన దానిగురించేనా!?
వాషింగ్టన్: అంతరిక్ష రంగంలో ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమిస్తున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఇదీ ఆ ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా నాసా శాస్త్రవేత్తలకు ఓ కొత్త విషయం తెలిసిందట. అదేంటన్నది డిసెంబర్ 14న వారు ప్రకటించబోతున్నట్లు తెలిసింది.
నిజానికి గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనేందుకు నాసా కెప్లర్ టెలిస్కోప్ సహాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలకు భూమిని పోలిన 2500కు పైగా గ్రహాలు కనిపించాయట.
కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను గూగుల్ సంస్థ అందించిన మెషిన్ లెర్నింగ్ విధానం ద్వారా నాసా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ గ్రహాలన్నీ 'గోల్డీలాక్ జోన్'లోనే పరిభ్రమిస్తున్నాయని, జీవజాలం అభివృద్ధికి ఈ గ్రహాల పరిస్థితులు అనుకూలిస్తాయని గతంలోనే వెల్లడించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న నాసా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓ సంచలన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ గ్రహాల్లో ఏదో ఒక గ్రహంలో జీవం జాడలు కనిపించి ఉంటాయని, ఆ విషయాన్నే నాసా శాస్త్రవేత్తలు ప్రకటించబోతున్నారనేది విశ్లేషకులు అభిప్రాయం.