ఔను! అతను ఫిబ్రవరి 30నే పుట్టాడు?: అదే అతనికి శాపమైంది
ఛండీగఢ్: ఓ పంజాబీ యువకుడికి ఎవరికీ కలలో కూడా ఊహించని కష్టం వచ్చింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అతని పాలిట శాపంగా మారింది. అధికారులు అతని పుట్టిన తేదీని తప్పుగా వ్రాయడమే ఇందుకు కారణం. తప్పుగా అంటే మామూలు తప్పు కాదు.. క్షమించరాని తప్పు.
ఆ వివరాల్లోకి వెళితే.. లూథియానాకు చెందిన హర్ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 20, 1995లో జన్మించాడు. కాగా, 2012లో చదువు మానేసిన హర్ప్రీత్.. 2015లో పంజాబ్ ఓపెన్ స్కూల్ స్కీం కింద మెట్రిక్యూలెషన్ పరీక్షలు పూర్తి చేశాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో అతను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం 2016, అక్టోబర్ 21న దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో సివిల్ సర్జన్ ఆఫీస్ అధికారులు అతనికి జనన ధృవీకరణ పత్రం అందజేశారు. అయితే, అతని పుట్టిన తేదీని 1995, ఫిబ్రవరి 30 అని రాయడం గమనార్హం. అంతేగాక, అది కూడా పెన్నుతోనే రాశారు.
ఈ విషయాన్ని గమనించకుండానే ఆ సర్టిఫికేట్పై సివిల్ సర్జన్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు కూడా సంతకాలు చేశారు. ఇది గమనించిన హర్ప్రీత్.. పుట్టిన తేదీ తప్పుగా పడిందని, సరిచేయాలని సదరు ఆఫీసు చుట్టూ గత కొంతకాలంగా తిరుగుతున్నాడు. అయినా, అక్కడి అధికారులు పట్టించుకోలేదు.
దీంతో విసిగిపోయిన హర్ప్రీత్.. ఇక ఇక్కడితే చదువు మానేసి, కెనడా వెళ్లి ఏదైనా పనిచేసుకుంటూ జీవించాలని నిర్ణయించుకున్నాడు .అయితే, పాస్ పోర్ట్ కోసం కూడా జనన ధృవీకరణ పత్రం అవసరం కావడంతో.. అతని కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. దీంతో మరోసారి తేదీ సరిచేయాలంటూ సివిల్ సర్జన్ ఆఫీసు చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. చివరకు తన ఆవేదనను అధికారులు పట్టించుకోవడం లేదంటూ మీడియా ముందకు వచ్చాడు హర్ప్రీత్. తప్పు చేసిన అధికారులు.. ఆ తప్పును సరిచేయమంటే.. ఎందుకు స్పందించడం లేదో తెలియడంలేదని వాపోయాడు.