బిట్కాయిన్పై కొరడా: లక్ష మందికి నోటీసులు.. 6000 డాలర్ల దిగువకు చేరిన వాల్యూ
న్యూఢిల్లీ: మీరేమైనా బిట్కాయిన్స్ లాంటి క్రిప్టో కరెన్సీల్లో పెట్టారా? లేదా? అయితే ఆ పెట్టుబడులను మీ ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్లో తెలిపారో లేదో గుర్తు చేసుకోండి. పేర్కొనకపోతే మాత్రం త్వరలోనే మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు ఖాయం. ఐటీ రిటర్న్లో ఈ పెట్టుబడుల ఆదాయ వనరులు పేర్కొనకపోయినా, వీటి అమ్మకాలపై వచ్చిన లాభాలపై పన్ను చెల్లించక పోయినా అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. ఇప్పటి వరకు లక్ష మంది ఇన్వెస్టర్లకు నోటీసులు జారీ చేశామని ఆయన అన్నారు. 'ఈ పెట్టుబడుల ఆదాయం, అమ్మినపుడు వచ్చే లాభాలు పన్నుల పరిధిలోకి వస్తాయి. అందుకే వారికి నోటీసులు జారీ చేస్తున్నాం' అన్నారు. ఈ మేరకు ఇప్పటికే దేశవ్యాప్తంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ (డిజి)లకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఎలాంటి చట్ట బద్దత లేని బిట్కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీలను నిర్మూలించి తీరుతామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన కొద్ది రోజులకే సిబిడిటి ఈ చర్య తీసుకోవడం ఆసక్తికర పరిణామం.
ఇదిలా ఉంటే వేతన జీవులు, స్వల్ప ఆదాయ వర్గాల వారికి ఐటీ శాఖ ఊరట ఇవ్వనున్నది. ఐటీ అధికారుల వద్ద ఉండే ఫామ్ 26ఏఎస్, ఐటీ రిటర్న్స్ దాఖలు సమయంలో సమర్పించే ఫామ్ 16ల్లో స్వల్ప తేడాలు ఉన్నా వేతన జీవులు, స్వల్ప ఆదాయ వర్గాల వారికి ఊరట ఇవ్వాలని నిర్ణయించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర అన్నారు. అయితే బారీగా వ్యత్యాసాలు ఉన్న వారి రిటర్న్స్ పరిశీలించిన తర్వాత వారు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారా? అన్న కోణంలో లోతుగా అద్యయనం చేస్తామని, వారికి నోటీసులు కూడా జారీ చేస్తామని తేల్చి చెప్పారు.
మంగళవారం 20 శాతం పతనం ఇలా
బిట్కాయిన్ భారీగా పతనమైంది. మంగళవారం ఏకంగా 20 శాతం మేర కిందకి పడిపోయింది. మూడు నెలల కాలంలో తొలిసారి 6,000 డాలర్ల మార్క్ కిందకి వచ్చి చేరింది. తిరిగి మంగళవారం రాత్రికల్లా 7,243.31 డాలర్లకు చేరుకున్నా నెల రోజుల క్రితం విలువతో పోలిస్తే 65 శాతం తగ్గుముఖం పట్టింది. ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రధాన మార్కెట్లలో క్రిప్టోకరెన్సీకి ఎదురుదెబ్బలు తగులుతుండటంతో దీని విలువ భారీగా కుదేలవుతోంది. నవంబర్ మధ్య నుంచి తొలిసారి ఈ వర్చ్యువల్ కరెన్సీ 6,190 డాలర్లకు పడిపోయిందని బ్లూమ్బర్గ్ రిపోర్టు చేసింది. క్రిప్టోమార్కెట్కు పలు దేశాల నుంచి కఠినతరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చైనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధిస్తున్నాయి. పేమెంట్ సిస్టమ్లో క్రిప్టోకరెన్సీలను వాడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ కూడా ప్రకటించింది. హ్యాకర్లు 530 మిలియన్ డాలర్లు వర్చ్యువల్ కరెన్సీని దొంగలించడంతో, ఆ కరెన్సీ ఎక్స్చేంజ్పై జపాన్ అథారిటీ అధికారులు దాడులు కూడా చేశారు.
భారీగా పతనం అవుతున్న బిట్ కాయిన్ విలువ
రుణ భయాలతో పలు కమర్షియల్ లెండర్లు క్రెటిట్ కార్డుల ద్వారా కస్టమర్లు బిట్కాయిన్లను కొనుగోలు చేయడానికి నిరాకరించాయి. యూరప్, జపాన్, అమెరికా సెంట్రల్ బ్యాంకులు కూడా బిట్కాయిన్లపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీంతో బిట్కాయిన్ విలువ భారీగా కిందకి పడిపోతుంది. అటు ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. క్రెడిట్ కార్డుల ద్వారా బిట్ కాయిన్లు కొనుగోలు చేయొద్దని జేపీ మోర్గాన్ చేస్, సిటీ గ్రూప్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచించాయి. రెండు రోజుల క్రితం వరకు 15 శాతానికి బిట్ కాయిన్ విలువ పతనమైంది. బ్రిటన్ బ్యాంక్ ల్లోయిడ్ బ్యాంకింగ్ గ్రూప్ తన కస్టమర్లు క్రెడిట్ కార్డుల ద్వారా బిట్ కాయిన్లు కొనుగోలు చేయొద్దని హెచ్చరించింది. కొన్ని రోజుల క్రితం బిట్ కాయిన్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్ బుక్' ప్రకటించడం గమనార్హం.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సారథ్యంలో కమిటీ ఇలా
బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. పేమెంట్ సిస్టమ్లోకి క్రిప్టోకరెన్సీలను అనుమతించవద్దని చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అధ్యక్షతన ఓ ప్యానల్ను కూడా గత డిసెంబర్లోనే నియమించింది. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన అంశాలన్నింటినీ ఈ ప్యానల్ పరిశీలించనున్నది. ఈ ఏడాది మార్చి 31 వరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఎస్.సీ గార్గ్ తెలిపారు. ఈ కమిటీలో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చైర్మన్ అజయ్ త్యాగి, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగ్ సభ్యులు. పేమెంట్ సిస్టమ్లో వీటిని చట్టవిరుద్దమైనవిగా పరిగణించేందుకు చర్యలు సుకుంటున్నామని సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. అలాగే ‘క్రిప్టో ఆస్తులు' ట్రేడ్ అయ్యే అన్రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్లను రెగ్యులేట్ చేయాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి క్రిప్టో ఆస్తులను వాడకాన్ని కూడా ప్రభుత్వం నిర్మూలిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. ఈ డిజిటల్ కరెన్సీ పెట్టుబడులపై ప్రభుత్వం వార్నింగ్లు ఇస్తూనే ఉంది. ఇవి ''పోంజి స్కీమ్'' లుగా పేర్కొంటోంది. అయితే క్రిప్టో ఎక్స్చేంజ్లను రెగ్యులేట్ చేయాలనుకోవడం శుభ పరిణామం అని ఇండస్ట్రి బాడీ, క్రిప్టో కరెన్సీ కమిటీ, బ్లాక్చైన్ ప్రెసిడెంట్ అజిత్ కురానా అన్నారు.