హెచ్1బీ వీసాలు: అన్నీ తగ్గినా టెక్ మహీంద్రా ముందంజ
వాషింగ్టన్: భారత కంపెనీలకు హెచ్1బీ వీసాల పొందడం కష్టతరంగా మారింది. 2015 నుంచి 2017 మధ్యలో ఏడు భారత ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసాల మంజూరు 43 శాతం తగ్గిందని అమెరికా సంస్థ ఒకటి పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ కంపెనీలకు 8,468 కొత్త హెచ్1బీ వీసాలు మంజూరు అయ్యాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తన నివేదికలో పేర్కొంది.
ఆమెరికాలో ఉన్న 16 కోట్ల మంది ఉద్యోగుల్లో ఇది 0.006 శాతం అని తెలిపింది. 2014-15లో కంపెనీలు పొందిన 14,792 హెచ్1బీ వీసాలతో పోలిస్తే 43 శాతం తక్కువగా నమోదయింది.
కాగా, ఇన్ఫోసిస్ పొందిన హెచ్ 1బీ వీసాలు 2,830 నుంచి 57 శాతం తగ్గి 1,218కు, విప్రోకు 3,079 నుంచి 1,210కు తగ్గాయి. టెక్ మహీంద్రా దక్కించుకున్న హెచ్ 1బీ వీసాల సంఖ్య మాత్రం 1576 నుంచి 2233కు పెరిగింది.
క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ వంటి డిజిటల్ సేవల వైపు ఐటీ పరిశ్రమ నడుస్తోంది. దీంతో తక్కువ మంది ఉధ్యోగులు అవసరపడటం, అమెరికాలో స్థానిక ఉద్యోగులకు కంపెనీలు పెద్ద పీట వేయడం వంటి కారణాలతో వీసాల సంఖ్య తగ్గిందని అంటున్నారు.