స్టాక్ మార్కెట్ల భారీ పతనం: ఆ ఒక్కడే 32 వేల కోట్లు నష్టపోయాడు! జాబితాలో 500 మంది బడాబాబులు..
న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం మదుపరులకు చుక్కలు చూపించింది. 2011 ఆగస్ట్ తర్వాత డౌ జోన్స్ 1175 పాయింట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది బిలియనీర్లకు చెందిన లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
పాతాళానికి సెన్సెక్స్, ఆరంభంలోనే 1000 పాయింట్ల పతనం, నిమిషంలో రూ. 5 లక్షల కోట్లు ఆవిరి!
ఈ సంపన్నులు సుమారు రూ.7 లక్షల 32 వేల కోట్లు నష్టపోయినట్లు బ్లూమ్బర్గ్ అంచనా వేసింది. ఇందులో ఒక్క బిలియనీరే అత్యధికంగా సుమారు 500 కోట్ల డాలర్లు (సుమారు రూ.32 వేల కోట్లు) నష్టపోవడం గమనార్హం.
భారీగా ఆవిరైన.. వారెన్ బఫెట్ సంపద...
ప్రపంచంలోని అపర కుబేరులలో బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ ఒకరు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో అత్యంత తెలివైన, సహనపరుడైన ఇన్వెస్టర్గా ఈయనకు గొప్ప పేరుంది. కానీ ఎంత పేరున్నా ఏం లాభం? స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా ఆయన కూడా 24 గంటల వ్యవధిలో 32 వేల కోట్ల సంపదను కోల్పోయారు. వెల్స్ అండ్ ఫార్గో కంపెనీలో మెజార్టీ వాటా బెర్క్షైర్ కంపెనీదే. ఈ కంపెనీ షేరు 9.2 శాతం మేర పతనం కావడంతో బఫెట్కు సంభవించిన నష్టం కూడా భారీగానే ఉంది.
జాబితాలో జుకెర్ బర్గ్, జెఫ్ బెజోస్, ఇంకా...
బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ తర్వాత భారీగా నష్టపోయిన సంపన్నులలో.. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్బర్గ్ 360 కోట్ల డాలర్లు (సుమారు రూ.23 వేల కోట్లు) నష్టపోయాడు. అటు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా సుమారు రూ.21 వేల కోట్ల సంపదను కోల్పోయారు. ఆల్ఫాబెట్ ఓనర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు సుమారు రూ.15 వేల కోట్ల మేర నష్టపోయారు.
దారుణంగా పతనమైన డౌ జోన్స్...
అమెరికా చరిత్రలో ఎన్నడూలేని విధంగా డౌ జోన్స్ దారుణంగా పతనమైంది. మెటల్, రియాల్టీ, కేపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ అన్నీ ఘోరంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు మంగళవారం మన స్టాక్ మార్కెట్లపైన, సెన్సెక్స్పై తీవ్ర ప్రభావం చూపించాయి.
ఒడిదుడుకులు కొనసాగొచ్చు...
అయితే ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని.. అంతర్జాతీయ మార్కెట్ల పతనం మన దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందని మార్కెట్ ఎక్స్పర్ట్ గౌరంగ్ షా తెలిపారు. అంతేకాదు.. మిడ్, స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్లు మరింత పతనమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఆర్బీఐ రేపు క్రెడిట్ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా.
గంటలో 5.4 లక్షల కోట్ల సంపద మాయం!
కొన్ని నెలలుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ.. కొత్త ఎత్తులకు వెళ్లిన సెన్సెక్స్ బడ్జెట్ తర్వాత భారీగా పతనమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ట్రేడింగ్లో ఒక్కసారిగా 1200 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఒక్క గంటలోనే రూ.5.4 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 36 వేల పాయింట్ల మార్క్ను దాటి చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. తాజాగా 34 వేల పాయింట్ల మార్క్ కంటే కిందికి పడిపోయింది.