ఫ్లిప్కార్ట్లో 60 శాతం వాటా కోనుగోలుకు రెడీ: అమెజాన్
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్లో సుమారు 60 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. దీనికి తోడు 2 బిలియన్ డాలర్ల టర్మినేషన్ ఫీజును కూడ ప్రతిపాదించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గతంలో వాల్మార్ట్ ప్రతిపాదించిన భారీడీల్తో సమానమైన మొత్తంగా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన రీటైలర్ వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లో 51 శాతానికి పైగా వాటాను కొనుగోలు చేయనుందనే వార్తలు వెలువడ్డాయి.
ఈ ఒప్పందం విలువ సుమారు 80 వేల కోట్ల రూపాయాలు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఫ్లిప్కార్ట్ మార్కెట్ విలువ రూ.లక్షా 20 వేల కోట్లుగా ఉండనుందని సమాచారం. ఈ ఒప్పందం జరిగితే ఇదే ఈ దశాబ్దానికి గాను పెద్ద ఒప్పందంగా రికార్డు నెలకొల్పుతుంది.
రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఫ్లిప్కార్ట్ కోసం పోటీ పడుతుండటంతో చివరకు ఫ్లిప్కార్ట్ను ఎవరు చేజిక్కించుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఫ్లిప్కార్ట్ పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు మాత్రం వాల్మార్ట్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. అలానే అమెజాన్ కూడా ఎటువంటి పోటికి ఆస్కారం లేకుండా ఫ్లిప్కార్ట్ను సొంతం చేసుకునేలా ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
త్వరలోనే వాల్మార్ట్ గ్లోబల్ టీం భారతదేశానికి వచ్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని తెలిసింది. అయితే ఈ వార్తల గురించి వాల్మార్ట్ కానీ, అమెజాన్ కానీ స్పందించలేదు.