అనీల్-అదానీ రూ. 18,000కోట్ల పవర్ డీల్: లాభాల్లో షేర్లు
ముంబై: గత కొంత కాలంగా అప్పులో ఉన్న తన గ్రూప్ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలా? అని తీవ్ర ప్రయత్నాలు చేసిన రిలియన్స్ ఇన్ఫ్రా ఛైర్మన్ అనీల్ అంబానీ.. చివరకు తన సమస్యకు పరిష్కార మార్గం కనుగొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ముంబై పవర్ బిజినెస్ విక్రయించేందుకు అదానీ ట్రాన్స్మిషన్తో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
సమీకృత ముంబై పవర్ బిజినెస్లో 100 శాతం వాటాను అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించి రిలయన్స్ ఇన్ఫ్రా గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మొత్తం డీల్ విలువ రూ. 18,800 కోట్లుకాగా, ముంబైలో రిలయన్స్ ఇన్ఫ్రా నిర్వహిస్తున్న విద్యుదుత్పత్తి, పంపిణీ బిజినెస్లు అదానీ ట్రాన్స్మిషన్కు బదిలీకానున్నాయి. ముంబై పవర్ బిజినెస్కు 30 లక్షల మంది కస్టమర్లున్నారు. 1892 మెగావాట్ల విద్యుత్ పంపిణీ చేపడుతోంది.
అంతేగాక, 500 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్లాంటును కలిగి ఉంది. ఈ డీల్ ద్వారా తమకు దక్కే మొత్తాన్ని రిలయన్స్ ఇన్ఫ్రా తన అప్పులను తగ్గించుకోనుంది. కాగా, ఈ ఒప్పందం ద్వారా అప్పుల తర్వాత సుమారు రూ .3,000 కోట్ల మిగులు వుంటుందని, ఈ నిధులను ఇతర నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి తమకు సహాయపడుతుందని రిలయన్స్ ఇన్ ఫ్రా సీఈవో అనిల్ జలాన్ వివరించారు.
ఈ మేరకు రూ. 10,000 కోట్ల ఆర్డర్ బుక్తో దేశంలో రెండో అతిపెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న తమకు చౌకైన నిధులకు సులభ ప్రాప్యతను కలిగి ఉంటామని చెప్పారు. ఈ ఒఫ్పందం నేపథ్యంలో శుక్రవారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 5 శాతం పెరిగింది. గురువారం ఆల్టైం హైని తాకిన అదానీ ట్రాన్స్మిషన్ 10 శాతం లాభాలతో కొనసాగుతోంది.