ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: స్టాక్ మార్కెట్ భారీ పతనం
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై స్పష్టంగా పడింది. ప్రధాన సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ ఆరంభంలోనే 500 పాయింట్లు కోల్పోయింది. కొంత మేరకు తేరుకొని సెన్సెక్స్ 400 పాయింట్లతో, నిఫ్టీ 115 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టి 400 పాయింట్లు కోల్పోయింది.
యస్ బ్యాంక్, గెయిల్, జీ ఎంటర్టైన్మెంట్, టెక్ మహేంద్ర, ఎస్బీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండియా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయాయి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మొత్తం కలిపి 65 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంటుందనే అభిప్రాయాన్ని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా ప్రభావం మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంటున్నారు.