ఎటీఎంలలో నగదు కొరత: తెలంగాణ, ఏపీ సహా.. శుభవార్త చెప్పిన ఎస్బీఐ చైర్మన్
Recommended Video
ముంబై: ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం స్పందించారు. నగదు కొరత సమస్య రేపటిలోగా (శుక్రవారం) పరిష్కారం అవుతుందని చెప్పారు. ఏయే ప్రాంతాల్లో నగదు కొరత ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలకు డబ్బు రవాణా జరుగుతోందన్నారు.
డబ్బు కొరత అన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాల్లో ఒకే విధంగా లేదన్నారు. తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ రాష్ట్రాలకు సాయంత్రానికి డబ్బులు చేరుకుంటాయని శుభవార్త చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అకస్మాత్తుగా నగదు వినియోగం పెరిగిందన్నారు.
ఒకేసారి ఈ డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కారం అవుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ముంబైకి చెందిన సిటీ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ కార్యకలాపాలపై ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. అంతేగాక కో ఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ విత్ డ్రా చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది.
ముంబైకి చెందిన సిటీ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ ఖాతాదారులు తమ పొదుపు ఖాతా, డిపాజిట్ ఖాతా లేదా కరెంట్ ఖాతాల నుంచి రూ.వెయ్యి మాత్రమే తీసుకోవచ్చునని, అంతకంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బ్యాంకు అనుమతించకూడదని చెప్పింది.
కొత్త డిపాజిట్లు అంగీకరించాలన్నా, రుణాలు ఇవ్వాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, అప్పులు తీసుకోవాలన్నా సదరు సిటీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించింది. పరిస్థితి మెరుగుపడే వరకు ఇది వర్తిస్తుందని చెప్పింది.