ఆస్ట్రేలియాకు ట్రంప్ స్నేహ హస్తం: నో ప్రాబ్లం అన్న ఆనంద్ మహీంద్రా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తన మిత్ర దేశం ఆస్ట్రేలియాకు చేయూతనిచ్చేందుకు అంగీకరించారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు ఇనుము, అల్యూమినియం దిగుమతిపై విధిస్తున్న దిగుమతి సుంకం నుంచి ఆస్ట్రేలియాకు త్వరలోనే మినహాయింపు ఇవ్వనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇటీవల ట్రంప్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్పై 25శాతం, ఉక్కుపై 10శాతం దిగుమతి సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన ఆదేశాలపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ముందే ఈ నిబంధన నుంచి కెనడా, మెక్సికోలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.ఈ సుంకాల నుంచి మినహాయింపు కావాలనుకుంటే ఆ దేశాలు తమతో చర్చలు జరపాలని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాతో వాణిజ్యంలో మిగులు ఉందన్న ట్రంప్
తాను ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్తో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. టర్న్బుల్ కూడా ఒకే విధమైన మిలిటరీ, వాణిజ్య సంబధాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని, తాము భద్రతా పరమైన ఒప్పందంపై సంతకాలు చేయనున్నామన్నారు. ఆస్ట్రేలియా గొప్పదేశం అని అభివర్ణించారు. దీంతో తమ మిత్ర దేశమైన ఆస్ట్రేలియాపై స్టీలు, ఉక్కుపై దిగుమతులపై సుంకాలు విధించబోమని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాతో తమ వాణిజ్యంలో మిగులు ఉన్నదని ట్రంప్ పేర్కొన్నారు. సుంకాల తగ్గింపుపై తమ దేశ భద్రత ప్రధానంగా వివిధ దేశాలతో సంప్రదిస్తామని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి సారా శాండర్స్ తాజాగా మరొక ప్రకటన చేశారు.
ట్రంప్ రాయితీతో రెండు దేశాలకు లబ్ధి చేకూరుతుందన్న ఆస్ట్రేలియా ప్రధాని
తాను ట్రంప్తో మాట్లాడినట్లు టర్న్బుల్ కూడా ధ్రువీకరించారు. వాణిజ్యం, భద్రత అంశాలపై ట్రంప్తో తన సంభాషణ చాలా గొప్పగా సాగిందన్నారు. ఆస్ట్రేలియా-అమెరికా మధ్య వాణిజ్యం చాలా పారదర్శకంగా, పరస్పరం ఒకే విధంగా ఉంటుందని తెలిపారు. అమెరికా విధించిన కొత్త దిగుమతి సుంకాల నుంచి ఆస్ట్రేలియాకు మినహాయింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. తమ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీలు, అల్యూమినియంపై సుంకాలకు మినహాయింపు ఇచ్చినందువల్ల ఆస్ట్రేలియా, అమెరికాల్లో కూడా ఉద్యోగాలకు మంచి జరుగుతుందని చెబుతూ ట్రంప్ ట్వీట్కు టర్న్బుల్ రీట్వీట్ చేశారు. తాజా పరిణామంతో అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఉద్యోగాలు లభిస్తాయని టర్న్ బుల్ పేర్కొన్నారు.
భారత్కు ఇబ్బందేమీ లేదన్న మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత
విదేశీ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించినా భారత్కొచ్చిన భయమేమీలేదన్నారు మహీంద్రా గ్రూప్ సంస్థల అధిపతి ఆనంద్ మహీంద్రా. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన ప్రపంచ వాణిజ్య యుద్ధంలో భారత్ నిలదొక్కుకోగలదన్న ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుచ్చారీ ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్త. ట్రంప్ విధానాలు పూర్తిగా రక్షణాత్మకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా సాగే వాణిజ్య యుద్ధంలో భారత్ నిలబడగలదన్నారు.
భారత్ లోనే బహుళజాతి సంస్థల ఉత్పత్తి యత్నాలు చేస్తున్నాయి
అమెరికా వైఖరిపట్ల శనివారం ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. చిన్న, ఎగుమతులపైనే ఆధారపడ్డ దేశాలకు నష్టంగానీ, భారత్ వంటి భారీ ఆర్థిక వ్యవస్థలకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. అంతేగాక దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి, స్థిరపడాలనుకునే బహుళజాతి సంస్థలెన్నో ఇప్పుడు భారత్లోనే తయారీ కేంద్రాలను పెట్టాలని చూస్తున్నాయన్నారు. శరవేగంగా అభివ్రుద్ధి చెందుతున్న భారతదేశంపై అమెరికా టారీఫ్ల ప్రభావం చెప్పుకోదగ్గస్థాయిలో ఏమీ ఉండబోదన్నారు. ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలపైనే ట్రంప్ సుంకాల ప్రభావం ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆధునాతన టెక్నాలజీతో దూసుకెళుతూ ఇన్నోవేషన్, స్టార్టప్ లతో ముందుకు సాగుతున్న భారతదేశానికి అంతర్జాతీయంగా స్వేచ్ఛా మార్కెట్లు పుష్కలంగా ఉన్నాయన్నారు.
చైనా, జపాన్, దక్షిణకొరియా విధానాలను అర్థం చేసుకోవాలని సజ్జన్ సూచన
మరో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ స్పందిస్తూ వ్యూహాత్మకంగా ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థకు ఇనుము చాలా కీలకం అని అన్నారు. చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలను భారత ప్రభుత్వాధినేతలు అర్థం చేసుకోవాలని ట్వీట్ చేశారు. జపాన్ ఏటా 60 మెట్రిక్ టన్నుల ఇనుము అవసరమైనా ఏనాడు వారు దిగుమతి చేసుకోలేదు.వారు 110 - 120 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తూ 50 శాతం ఎగుమతి చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇతర దేశాలతో సంప్రదిస్తామన్ని కేంద్రమంత్రి సురేశ్ ప్రభు
ఇనుము, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకం విధిస్తూ తీసుకున్న నిర్ణయం దురద్రుష్టకరమని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. భారతదేశం స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉన్నదన్నారు. దీనిపై ప్రపంచ దేశాలతో ద్వైపాక్షికంగా చర్చిస్తామని సురేశ్ ప్రభు స్పష్టం చేశారు.