బంధన్ బ్యాంక్ ఐపీవోకు భలే స్పందన!
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన బంధన్ బ్యాంక్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీ ప్రీమియంతో లిస్టయ్యాయి. మంగళవారం ఉదయం ఈ బ్యాంకు ఇష్యూ షేర్ ధర రూ.375తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 30 శాతం ప్రీమియంతో రూ.485 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఎన్ఎస్ఈలో అయితే 33 శాతం ప్రీమియంతో రూ.499 వద్ద లిస్ట్ అయింది.
ఉదయం గం.11:00లకు షేర్ల ప్రీమియం ధర రూ.375తో పోలిస్తే 26.23 శాతం లాభంతో రూ.473.70 వద్ద ట్రేడ్ అయింది. రూ. 495 వద్ద గరిష్టాన్ని, రూ.455 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ ధర వద్ద బంధన్ బ్యాంక్ షేర్ల మొత్తం విలువ రూ. 56,000 కోట్లుగా వుంది.
దశాబ్దకాలంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొత్త తరం బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ వాల్యుయేషన్ 69,000 కోట్లుకాగా, ఈ షేరు ధర పుస్తక విలువకు 3 రెట్లు ట్రేడవుతుండగా, బంధన్ బ్యాంక్ 5 రెట్లు విలువతో లిస్ట్ అవడం గమనార్హం.
కోల్కతాలో మైక్రోఫైనాన్స్ సంస్థగా ప్రారంభమైన బంధన్.. ఆ తర్వాత తన కార్యకలాపాలను విస్తరించింది. 2014 ఏప్రిల్లో బ్యాంకింగ్ లైసెన్స్ను సంపాదించింది. 2015 ఆగస్టులో ఈ సంస్థ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం కోటి మంది సూక్ష్మ రుణ కస్టమర్లను కలిగి ఉంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రకాల వినియోగదారులకు సేవలందించేందుకు భారత ప్రభుత్వ, ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది.
ఈ బ్యాంకుకు 18.7లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. బంధన్ బ్యాంకు ఎక్కువగా సూక్ష్మ రుణాలు, ఎస్ఎంఈ రుణాలు, చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చే కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉంది.
ప్రస్తుతం బంధన్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా 864 బ్రాంచ్లు, 386 ఏటీఎంలను కలిగివుంది. ఇందులో 70 శాతానికి పైగా బ్రాంచ్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్, అస్సాం, బీహార్లతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్యాంక్కు పటిష్టమైన నెట్వర్క్ వుంది.