శక్తికాంత్ దాస్ అవినీతిపరుడు, గురుమూర్తిని బోర్డులోకి తేవడం మిస్టేక్: సుబ్రహ్మణ్య స్వామి
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ అవినీతిపరుడు అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ దిశ, దశను నిర్ధేశించే అత్యున్నత స్థాయి పోస్టుకు దాస్ను ఎంపిక చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 2018 ఎన్నికల ఇంటరాక్షన్ కార్యక్రమానికి సుబ్రహ్మణ్య స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. శక్తికాంత్ దాస్ను అవినీతి ఆరోపణల కారణంగా ఆర్థిక శాఖ నుంచి తొలగించారని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఆర్బీఐ గవర్నర్గా ఎలా తీసుకు వచ్చారని ప్రశ్నించారు.
అయితే దాస్ ఎక్కడ, ఎలా అవినీతి చేశారన్న దానిపై వివరణ ఇవ్వలేదని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. కొత్త ఆర్బీఐ గవర్నర్ అవినీతిపరుడు అని, ఆయన కంటే ప్రొఫెసర్ ఆర్ వైద్యనాథన్ (మాజీ ప్రొఫెసర్ ఫైనాన్స్-ఐఐఎంబీ) చాలా బెట్టర్ అని చెప్పారు. అతను మాజీ సంఘ్ కార్యకర్త అన్నారు.
కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం పైన తాను వేసిన అవినీతి కేసు విషయంలో శక్తికాంత్ దాస్ జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేశారని చెప్పారు. అతను చిదంబరంకు దగ్గరివాడు అని చెప్పారు. చెన్నైలో ఉన్నప్పుడు అతను అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అలాగే ఆర్బీఐ బోర్డులోకి ఎస్ గురుమూర్తిని తీసుకురావడం కూడా పొరపాటు అన్నారు.