2018లో బడ్జెట్: జైట్లీజీ.. ఇవీ కోర్కెల చిట్టా.. ఒక్కసారి పరిశీలించరూ..
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 వస్తోంది. దానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెడతారు. నరేంద్ర మోదీ సర్కార్ ఐదేండ్ల పాలనలో ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. త్వరలో ఎనిమిది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఈసారి బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకున్నది.
దేశ చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణగా అభివర్ణిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత వస్తున్న తొలి బడ్జెట్ కూడా కావడంతో సహజంగానే అందరి చూపు దీనిపైనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులే కాదు.. విభిన్న రంగాల ప్రతినిధులు తమకేం కావాలో కోరికల చిట్టాలు నివేదిస్తున్నారు. దేశీయంగా గల సెల్ పోన్ సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయాలు సజావుగా సాగేందుకు విదేశీ దిగుమతులపై కస్టమ్స్ సుంకం పెంచాలని కోరుతున్నారు. కార్పొరేట్లు తమ లాభాలపై పన్నును 25 శాతానికి హేతుబద్ధీకరించాలని అభ్యర్థిస్తున్నారు.
దేశీయ సెల్ ఫోన్ కంపెనీలకు ట్యాక్ హాలీడే ఇవ్వాలి
ప్రస్తుతం దేశీయంగా సెల్ఫోన్ల అమ్మకాలు ఏటా రూ.1.5 లక్షల కోట్ల స్థాయిలో జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మేకిన్ ఇండియా స్ఫూర్తితో యాపిల్ సహా దేశ, విదేశీ సంస్థలన్నీ ఇక్కడే సెల్ఫోన్ల అసెంబ్లింగ్ ప్రక్రియ చేపట్టాయి. కానీ వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక, దేశీయ తయారీకి, దిగుమతులపై విదించే 10 శాతం పన్నుకు తేడా లేకుండా పోయింది. సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమ విజ్ఞప్తి మేరకు, దిగుమతులపై సుంకాన్ని 15 శాతానికి పెంచారు. తయారీ దేశీయంగా మరింత పెరిగేలా, చౌక ఉత్పత్తులు విపణిని ముంచెత్తకుండా, ఎగుమతులు కూడా ఇక్కడ నుంచే జరిగేలా 2018-19 బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని యాపిల్, శామ్సంగ్ సహా దేశీయ సంస్థలు కూడా కోరుతున్నాయి. తయారీ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ వీటిని ప్రభుత్వానికి నివేదించింది. దీని ప్రకారం పూర్తిస్థాయి సెల్ఫోన్లను దిగుమతి చేసుకుంటే, కస్టమ్స్ 20 శాతానికి పెంచాలి. దేశీయ సంస్థలను కాపాడేందుకు, దిగుమతి నిరోధక సుంకం కూడా విధించాలి. వీటితోపాటు సెల్ ఫోన్ విడిభాగాలు కూడా ఇక్కడే తయారయ్యేలా ప్రోత్సహించేందుకు ఛార్జర్లు, స్పీకర్లు, బ్యాటరీ, యూఎస్బీ కేబుల్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కెమేరా, ఎల్సీడీ తెరల దిగుమతిపై సుంకం అధికం చేయాలి. ఇక దేశీయ తయారీ సంస్థలకు 10 ఏళ్ల పన్ను విరామం కల్పించాలి. ప్రస్తుతం దేశీయంగా యాపిల్, శామ్సంగ్, ఎల్జీ, వివో, ఓపో, ఎంఐ, వన్ప్లస్ వంటి బహుళజాతి దిగ్గజాలతో పాటు దేశీయ సంస్థలైన మైక్రోమ్యాక్స్, సెల్కాన్ వంటివి ఫాక్స్కాన్ వంటి భాగస్వాములతో కలిసి, సొంత యూనిట్ల ద్వారా సెల్ఫోన్లు రూపొందిస్తున్నాయి. వీటికి అవసరమైన కొన్ని విడిభాగాలు అందించేందుకు 107 యూనిట్లు దేశీయంగా ఏర్పాటయ్యాయి. 2016తో పోలిస్తే 2017లో సెల్ఫోన్ దిగుమతులు 60 శాతం తగ్గాయి. దేశీయంగా 22.50 కోట్ల సెల్ఫోన్లు రూపొందాయి. 2016తో పోలిస్తే వీటి విలువ 47 శాతం పెరిగింది. 2019కు దేశీయంగా 50 కోట్ల సెల్ఫోన్లు తయారీ కావచ్చు. వీటి విలువ రూ.3.50 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో రూ.లక్ష కోట్ల విలువైన 12 కోట్ల సెల్ఫోన్లు ఎగుమతి చేసే వీలుంది. అయితే దేశం నుంచి ఎగుమతి అయిన సెల్ఫోన్ల విలువ రూ.6,000 కోట్లు ఉంటుందని అంచనా.
దీర్ఘ కాలిక పెట్టుబడులపై రెండేళ్లు పన్ను మినహాయింపు ఇవ్వాలి
వివిధ దేశాలతో పోలిస్తే కార్పొరేట్ ఆదాయంపై పన్ను చాలా ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం భారతదేశంలో కార్పొరేట్ పన్ను 27.7 శాతం వసూలు చేస్తున్నారు. దీన్ని ఉమ్మడిగా 25 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. 2015లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్ ఆదాయం పన్నును హేతుబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. 25 శాతం కంపెనీల ఆదాయం పన్ను తగ్గించడానికి చర్యలు తీసుకున్నారే గానీ పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరించడానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆయా కార్పొరేట్ సంస్థల దీర్ఘకాల పెట్టుబడులపై పన్ను మినహాయింపును ఏడాది నుంచి రెండేళ్లకు పెంచడంతోపాటు ఎలాంటి పన్ను విధించకూడదని కార్పొరేట్లు కోరుతున్నాయి. ఇక కార్పొరేట్ సంస్థల్లో వాటాదారులకు యాజమాన్యం పంపిణీ చేసే డివిడెండ్పై పన్ను పూర్తిగా రద్దు చేయాలని, ఓ క్రమ పద్ధతిలో వారసత్వ పన్ను 5% ప్రవేశపెట్టాలని సూచనలు వ్యక్తం అవుతున్నాయి. పారిశ్రామిక సంస్థలపై విధిస్తున్న సంస్థలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను తగ్గించడం గానీ, రద్దు చేయడం గానీ చేయాలని కోరుతున్నారు. మొండి బకాయిల సర్దుబాటుకు వీలుగా కనీస ప్రత్యామ్నాయ పన్నులో మార్పులు చేయాలంటున్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై పన్ను తగ్గించాలి
వ్యవసాయ దిగుబడులు పాడవ్వకుండా చూడటంతోపాటు వాటికి అదనపు విలువ జతచేరేందుకు, ఆహార తయారీ (ఫుడ్ప్రాసెసింగ్) పరిశ్రమల ఏర్పాటయ్యేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఎఫ్ఎంసీజీ సంస్థలు ఆశిస్తున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం ఆశిస్తున్నందున, ఇది తప్పనిసరని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో వ్యక్తిగత వినియోగం పెరిగేలా చూడాలి. త్వరగా పడయ్యే టమోటా, మామిడి వంటి పండ్లను ధర లేనపుడు రైతులు పారవేసారు. సాస్, పండ్లరసాల వంటి పరిశ్రమలు ఏర్పాటైతే, వృథా తగ్గడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు వెసులుబాటు లభిస్తుంది. ప్రత్యేకించి పంటల నిల్వకు గోదాములు, శీతల గిడ్డంగుల వంటి మౌలిక వసతులు కల్పించడానికి భారీగా ప్రోత్సాహకాలివ్వాలి. ఈ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పౌల్ట్రీ, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నులు తగ్గించాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలివ్వాలని. తక్కువ ఇంధనంతో, పర్యావరణ హితంగా మనగలిగేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ యువత వేతనాలు పెరగడం, కొత్త ఉద్యోగాలు రావడం వల్ల గృహాలు సహా అన్ని రంగాలకు గిరాకీ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత ఆదాయం పన్ను శ్లాబులు తగ్గిస్తే, ఖర్చు పెట్టేందుకు అవకాశం ఏర్పడి, ఆర్థిక వ్యవస్థలోకి మరిన్ని నిధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు.
పర్యావరణ హితంగా గ్యాస్ ను జీఎస్టీలోకి తేవాలి
అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కో బారల్ 70 డాలర్లకు చేరువలో ఉన్నది. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులతోనే పొందుతోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటును అదుపులో ఉంచేలా కేంద్ర బడ్జెట్ 2018-19లో చర్యలు తీసుకోవడం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కత్తిమీద సామే. 2018లో దిగుమతుల బిల్లు రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో బడ్జెట్లో చమురు రంగానికి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. చమురు తవ్వక, ఉత్పత్తి రంగానికి మౌలిక హోదా ఇవ్వాలని ముడి చమురు సంస్థలు కోరుతున్నాయి. ఇక స్థానికంగా తయారు చేసే ముడి చమురుపై పన్నులను తగ్గించడం ద్వారా దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహం ఇవ్వాలని, సహజ వాయువును కూడా వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో కలపాలని అభ్యర్థిస్తున్నారు. దీనివల్ల పర్యావరణహిత ఇంధన వినియోగం పెంచేలా చేయడానికి వీలవుతుంది. దేశీయ పెట్రోల్ ఉత్పత్తిపై సెస్ 20 శాతం నుంచి 8 శాతానికి తగ్గించాల్సి ఉందని చెప్తున్నారు. దేశీయ ముడి చమురుకు, దిగుమతులకు మధ్య ధరల అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులపై కేంద్ర విక్రయ పన్నును రెండు శాతం వరకు తగ్గించడం వల్ల దేశీయ ఇంధన భద్రతకు కూడా ఇది దోహదం చేస్తుంది.