సార్వత్రిక బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనంతో ఉపయోగాలెన్నో
న్యూఢిల్లీ: రైల్వేశాఖ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ అవసరం లేదని 'నీతి ఆయోగ్' సిఫారసు చేసింది. సార్వత్రిక బడ్జెట్తో పోలిస్తే రైల్వే బడ్జెట్ కుంచించుకు పోతుందని పేర్కొన్నది. నీతి ఆయోగ్ సిఫారసును పరిగణనలోకి తీసుకున్న నరేంద్రమోదీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 21న సాధారణ బడ్జెట్లోకి రైల్వే బడ్జెట్ను విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో 92 ఏళ్లుగా అమలులో ఉన్న సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చేసింది.
2017 - 18కి ముందు ప్రతియేటా రైల్వే రంగానికి, ఇతర రంగాలకు సార్వత్రిక బడ్జెట్లను ప్రవేశపెడుతూ వచ్చింది. బడ్జెట్ సంస్కరణల్లో భాగంగా ఆర్థిక లావాదేవీల నిర్వహణ తీరును మెరుగు పరిచేందుకు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ముందుకు జరిపింది.
చివరి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు
నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ సారథ్యంలోని కమిటీ బ్రిటిష్ పాలకుల నాటి విధానానికి అదే రైల్వేశాఖకు ప్రత్యేక బడ్జెట్ సమర్పించాల్సిన అవసరం లేదని సిఫారసు చేసింది. ఈ సిఫారసును రైల్వే బోర్డు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ ద్వారా అందజేసింది. జాతి దీర్ఘకాలిక ప్రయోజనాల ద్రుష్ట్యా రెండు బడ్జెట్లను విలీనం చేయాలన్న ప్రతిపాదనపై రాజ్యసభలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫారసుకు అనుగుణంగా రెండు బడ్జెట్లను కేంద్రం విలీనం చేసింది. దీంతో కేంద్రంలో రైల్వే బడ్జెట్ను 2016 ఫిబ్రవరి 25న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చివరి రైల్వేశాఖ మంత్రిగా సురేశ్ ప్రభు నిలుస్తారు.
చట్టబద్ధంగా విడి రైల్వే బడ్జెట్ అవసరం లేదన్న నీతి ఆయోగ్
అసలు 1920-21లో బ్రిటిష్ ఆర్థిక వేత్త విలియమ్స్ మిచైల్ అక్వర్త్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1924లో తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రారంభించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రైల్వేలదే 84 శాతం ఉంటుంది. 1924 నుంచి 2016 వరకు వేర్వేరుగా రైల్వే, సాధారణ బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చాయి. కాగా, నీతి ఆయోగ్ చేసిన సిఫారసుల్లో ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే రైల్వేలకు ప్రత్యేకమైన బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నది. చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా విడిగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేదని నీతి ఆయోగ్ అభిప్రాయ పడింది.
విలీనం వల్ల రైల్వే శాఖకు లాభాలు పుష్కలం
రైల్వేశాఖకంటే ఎక్కువగా ఖర్చు చేసే రక్షణ, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖల బడ్జెట్లు రైల్వేశాఖతో పోలిస్తే ఎక్కువే. కానీ ఈ శాఖల్లో దేనికి ప్రత్యేక బడ్జెట్ అమలు కావడం లేదు. దీనికి తోడు రైల్వే బడ్జెట్ను రాజకీయ పార్టీలు ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నాయని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. నూతన రైళ్లు, మార్గాలు, చార్జీల పెంపు, తదితర అంశాలన్నీ రాజకీయంగా ఆలోచిస్తున్నారని నీతి ఆయోగ్ పేర్కొన్నది. రైల్వే బడ్జెట్ను సాదారణ బడ్జెట్లో ప్రవేశపెట్టడం వల్ల కూడా లాభాలు ఉన్నాయని నీతి ఆయోగ్ వివరించింది.
ఒకేసారి ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే చాలు
స్థూల బడ్జెటరీ మద్దతు ప్రకటించినందుకు ఇప్పటివరకు రూ.9700 కోట్ల డివిడెండ్ ను ప్రభుత్వానికి కేంద్ర ఆర్థికశాఖకు సమర్పించాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ తెలిపింది. 2.27 లక్షల కోట్ల కేపిటల్ చార్జీ కూడా రద్దు అవుతుంది. రెండు బడ్జెట్లు రైల్వేశాఖకు పెట్టుబడి వ్యయం పెంచుకునే అవకాశం మెరుగవుతుంది. రైల్వే బడ్జెట్ ఉన్నప్పటితో పోలిస్తే.. పార్లమెంట్ ఉభయ సభలు ఒక ద్రవ్య వినిమియ బిల్లును ఆమోదిస్తే ఎంతో సమయం కలిసి వస్తుంది. రెండు బడ్జెట్ల విలీనం వల్ల భారీ పెట్టుబడి అవసరాలు గల రైల్వే శాఖకు ఏడో వేతన సంఘం వల్ల పడిన భారం రూ.40 వేల కోట్లు తప్పిపోయింది.