'భీమ్' లావాదేవీలకు బంపర్ ఆఫర్లు: అద్భుత క్యాష్ బ్యాక్
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను పెంచాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆవిష్కరించిన మొబైల్ చెల్లింపులు యాప్ భారత్ ఇంటర్పేస్ ఫర్ మొబైల్స్ (భీమ్-BHIM). యూపీఐ విధానం ద్వారా పని చేసే ఈ యాప్లో గతంతో పోలిస్తే పురస్తుతం జరుపుతున్న లావాదేవీల శాతం ఒక అంకెకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో క్యాష్ బ్యాక్లు, ప్రోత్సాహకాలతో దూసుకుపోతున్న తేజ్, ఫోన్ పే, పేటీఎంల మాదిరిగానే వినియోగదారులకు క్యాష్ బ్యాక్లు, ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న భీమ్ యాప్ ద్వారా రూ.900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
2016 డిసెంబర్లో ప్రధాని మోడీ భీమ్ యాప్ను ఆవిష్కరించారు. గూగుల్ తేజ్, ఫోన్ పే, పేటీఎం ద్వారా యూపీఐ లావాదేవీల సంఖ్య పెరగగా ప్రభుత్వ భీమ్ ద్వారా తగ్గాయి.
గత ఏడాది ఆగస్టులో భీమా లావాదేవీలు 40.5 శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 5.75 శాతానికి పడిపోయంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో ప్రయివేటు యాప్ల మాదిరిగా భీమ్ యాప్ ద్వారా తొలి లావాదేవీలు జరిపినప్పుడు కనీస మొత్తం రూ.100కు రూ.51 క్యాష్ బ్యాక్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత రూ.25 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. 25-50 లావాదేవీలకు మొత్తం ప్రోత్సాహకం రూ.100, ఒకే నెలలో 50-100 లావాదేవీలు జరిపితే లావాదేవీకి రూ.10 చొప్పున రూ.200 ప్రోత్సాహం అందించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇక 100కు పైగా లావాదేవీలు జరిపితే రూ.250 రానుంది. మొత్తంగా ఒక నెలకు రూ.2000 వరకు పొందవచ్చునని తెలుస్తోంది.