ప్చ్! ఏం లాభం: 11 ఏళ్లలో రూ.2.6 లక్షల కోట్లు.. బ్యాంకుల ప్రైవేటీకరణ బెస్టన్న ఫిక్కీ
న్యూఢిల్లీ: పీఎన్బీ ముంబై శాఖను మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రూ.11,400 కోట్లు మోసగిస్తే.. రొటొమాక్ యజమాని విక్రం కొఠారి రూ.3695 కోట్ల రుణం చెల్లించనే లేదు. ఇక ఫొర్టిస్ హెల్త్ కేర్ సహా వ్యవస్థాపకుడు మాల్విందర్ మోహన్ సింగ్ ఒక సంస్థకు గ్యారంటీ ఇచ్చిన రుణం తీరక ముందే హామీ పెట్టిన ఆస్తులు విక్రయించబోయారు. ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకులు దినదిన గండం నూరేళ్లాయుష్షుగా మారుతున్నది. గత 11 ఏళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించినావాటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. ఈ క్రమంలో ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని పరిశ్రమల సంఘం ఫిక్కి సూచించింది.
దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని హితవు పలికింది. ఇంతకుముందు మరో ఇండస్ట్రీ బాడీ 'అసోచామ్' కూడా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా తగ్గించుకోవాలని సూచించింది. బ్యాంకుల పనితీరు మెరుగు పడాలంటే ప్రైవేట్ శక్తుల భాగస్వామ్యం పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రైవేటీకరణ అంశాన్ని పరిశీలించాలన్న ఫిక్కీ
‘ప్రభుత్వరంగ బ్యాంకుల బలహీన పనితీరు కారణంగా ప్రభుత్వ ఆర్థిక వనరులపై నిరంతరం ఒత్తిళ్లు ఉంటున్నాయి. వాటిని ప్రైవేటీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీనివల్ల ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయి. వాటిని అభివృద్ధి పథకాలకు ఖర్చు చేయవచ్చు' అని ఫిక్కి ప్రెసిడెంట్ రాషేష్ షా పేర్కొన్నారు. క్రియాశీల బ్యాంకింగ్ తక్షణావసరమైందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులు ఆధిపత్యానికి తెర దించే విషయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు.
70% ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు
‘సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం భారత్ స్థిరమైన అధిక వృద్ధి రేటును నమోదు చేయాల్సి ఉంది. బలమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక రంగం సాయం లేకుండా ఇది సాధ్యం కాదు''అని ఫిక్కీ అధ్యక్షుడు రాషేష్ షా అన్నారు. దేశ బ్యాంకింగ్ రంగంలో 70 శాతం వాటా కలిగిన ప్రభుత్వ బ్యాంకులు మొండి బకాయిల సమస్యను ఎదుర్కోవడాన్ని షా గుర్తు చేశారు.
ప్రైవేట్ భాగస్వామ్యం పెంపొందించాలన్న అరవింద్ సుబ్రమణ్యం
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సబ్రమణ్యం కూడా ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుత్పాదకత గల ప్రభుత్వ రంగ బ్యాంకులు కుంచించుకుపోతున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల విశ్వసనీయత కొడిగట్టుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా మోసం కష్టం
పీఎన్బీలో స్కామ్పై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులను, మొత్తం యాజమాన్యాన్ని ఆ బాధ్యతల నుంచి పక్కన పెట్టాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది. కేవలం కిందిస్థాయి ఉద్యోగుల పాత్రే ఇందులో ఉందన్న భావన కలుగుతోందని పేర్కొంది.‘‘కింది స్థాయిలో తప్పులు చేసే వారిని సమర్థించడం లేదు. కానీ, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే బాధ్యులనే అభిప్రాయం కలుగుతోంది.
ఆర్బీఐ పాత్ర లేకుండా భారీగా ‘పీఎన్బీ' స్కాం అసాధ్యం
పీఎన్బీలో ఒక బ్యాంకు, ఒక శాఖ, ఇద్దరు ఉద్యోగులకే ఈ మోసాన్ని పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, భారీ స్థాయి మోసాలను సులభ విధానంలో చేయడం అసాధ్యం. ఓ శాఖ ఉద్యోగి రూ.11,400 కోట్ల మేర ఎల్వోయూలను ఆరు, ఏడేళ్ల కాలంలో వేరే వారికి తెలియకుండా జారీ చేయడం సాధ్యం కాదు'' అని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. టెక్నాలజీ, పర్యవేక్షణ, ఆడిట్, అంతర్గత నియంత్రణ, ఆర్బీఐ పాత్రపై ఈ స్కామ్ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తినట్టు ఏఐబీఈఏ పేర్కొంది.
పీఎన్బీ మోసంతో ఆడిటింగ్ వ్యవస్థపై సందేహాలు
పీఎన్బీ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్టాట్యుటరీ ఆడిటర్ల నియామక నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవకతవకలను ముందుగా గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సాయపడుతుందని భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులే ఏటా ఆడిటర్లను నియమించుకుంటున్నాయి. పీఎన్బీలో భారీ మోసం ఆల స్యంగా వెలుగు చూడడంతో ఎందుకు ఇన్నాళ్లు గుర్తించలేకపోయారని ఆడిటింగ్ వ్యవస్థపై ప్రశ్నలకు లేవనెత్తింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో కాగ్ ఆధ్వర్యంలో ఆడిటర్ నియామకం ‘
ప్రభుత్వరంగ బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థల(సీపీఎస్ఈ)కు ఆడిటర్ల నియామకంలో భేదం ఉంది. ప్రభుత్వరంగ కంపెనీ అయితే ఓ ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్ను కాగ్ నియమిస్తుంది. ఆడిటర్ తన నివేదికను కాగ్కు సమర్పించడం జరుగుతుంది. సీపీఎస్ఈలో ఆ స్థాయి స్కామ్ ఎందుకు చోటు చేసుకోలేదు. కంపెనీలకు, బ్యాంకులకు ఆడిటర్ల పనితీరులో ఎంతో అంతరం ఉంది'అని ఓ అధికారి పేర్కొన్నారు.