పసిడికి ప్రత్యామ్నాయమా? వట్టిమాటేనని తేల్చేసిన డబ్ల్యూజీసీ
న్యూఢిల్లీ:
పెట్టుబడిలో
పసిడికి
మరేదీ
ప్రత్యామ్నాయం
కాజాలదని
ప్రపంచ
పసిడి
మండలి
(డబ్ల్యూజీసీ)
స్పష్టం
చేసింది.
బిట్కాయిన్ల
వంటి
ఊహాజనిత
కరెన్సీ
కానే
కాదని
పేర్కొంది.
సమర్థ
పెట్టుబడి
సాధనంగా
పసిడి
ఎంత
మేలు
చేస్తుందో
ఇప్పటికే
రుజువైందని
గుర్తు
చేసింది.
ఆర్థిక
వ్యవస్థలో
ఊహాజనిత
కరెన్సీలు
భాగం
కావచ్చు
కానీ,
ముఖ్యమైన
ఆస్తిగా
నిరూపితమైన
స్వర్ణానికి
ప్రత్నామ్నాయం
కాదని
వివరించింది.
ప్రస్తుత
డిజిటల్
ప్రపంచంలోనూ
బంగారం
ప్రాముఖ్యం
యధాతథంగా
కొనసాగుతుందని
తాజా
నివేదికలో
తెలిపింది.
బిట్ కాయిన్ నుంచి పోటీకి నిదర్శనాలే లేవు
అంతర్జాతీయంగా బిట్ కాయిన్ మార్కెట్ విలువ 800 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52 లక్షల కోట్లు)కు చేరిందని, పసిడితో పోలిస్తే ఇది తక్కువని డబ్ల్యూజీసీ పేర్కొంది. వీటిల్లో అత్యధిక ప్రాచుర్యం కలిగిన బిట్కాయిన్ విలువ 2017లో 13 రెట్లు పెరిగిందని గుర్తు చేసింది. వీటి ఆధారంగా కొందరు ‘పసిడికి ప్రత్యామ్నాయం బిట్ కాయిన్' అని పేర్కొంటున్నారు. ఇవి రెండూ వేర్వేరు అనేది మా అభిప్రాయం అని తెలిపింది. 2017లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని, బిట్ కాయిన్ నుంచి పోటీ ఎదురవుతుందనడానికి నిదర్శనాలేమీ లేవని పేర్కొంది. నాణ్యత, పరిమాణ పరంగా కూడా బిట్ కాయిన్కు, పసిడికి పొంతనే లేదని డబ్ల్యూజీసీ వివరించింది.
సంపదకు, నగదు చిహ్నంగా స్వర్ణం
బంగారంపై పెట్టుబడులు సురక్షితమని ఇప్పటికే రుజువైంది. విలువ పరంగా ఒడుదొడుకులూ తక్కువే. ఎప్పుడైనా నగదుగా మార్చుకోవడం సులభం. వ్యవస్థీకృత నియంత్రణల మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. రోజూ సగటున 250 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16.25 లక్షల కోట్ల) విలువైన బంగారం ట్రేడ్ అవుతోంది. బంగారానికి 7,000 ఏళ్ల చరిత్ర ఉంది. భిన్న వర్గాల నుంచీ దీనికి గిరాకీ లభిస్తోంది. కీలకమైన ఆస్తిగా పసిడి వినియోగం అధికం. సంపద, నగదుకు చిహ్నంగా భావిస్తారు. కేంద్రీయ బ్యాంకులు, వ్యక్తిగత-సంస్థాగత పెట్టుబడిదారులూ పసిడిని కొనుగోలు చేస్తుంటారు.
రోజూ 250 బిలియన్ల డాలర్ల పసిడి ట్రేడింగ్
అధిక మొత్తంలో లావాదేవీల నిర్వహణకు పసిడి ప్రత్యామ్నాయంగా ఉన్నది. అత్యధిక దేశాలు పసిడి ట్రేడింగ్ను అనుమతించాయేగానీ ఎవరూ నిషేధించలేదు. ఆభరణాలుగా బంగారాన్ని వినియోగించడం అధికం. గత 20 ఏళ్లుగా 50-60 శాతం గిరాకీ ఆభరణాల రంగం నుంచే లభిస్తోంది. 1970 దశకం చివరిలో బంగారం ధర శరవేగంగా పెరిగినా, గత నాలుగు దశాబ్దాల్లో నియంత్రణలోనే ఉంటోంది. రోజువారీగా బిట్ కాయిన్ ట్రేడింగ్తో పోలిస్తే పసిడి ట్రేడింగ్ 250 బిలియన్ల డాలర్ల మేర ట్రేడింగ్ జరిగుతుంది. అదే బిట్ కాయిన్ ట్రేడింగ్ పసిడి ట్రేడింగ్లో ఒక శాతానికి తక్కువే ట్రేడ్ అవుతోంది.
బిట్ కాయిన్ల పరిధి చాలా పరిమితం
ఊహాజనిత కరెన్సీ ‘బిట్ కాయిన్' విలువ మాత్రం సరఫరా, గిరాకీకి అనుగుణంగానే ఉంటుందని తెలిపింది. నియంత్రణకు మార్గదర్శకాలు కూడా లేవన్న విమర్శలు ఉన్నాయి. కొనుగోళ్లు, అమ్మకాలకు స్పష్టమైన మార్కెట్లు ఏమీ లేవు. కొనుగోలు చేసి, అట్టేపెట్టుకున్న వారికి అనుగుణంగానే వీటి విలువ ఆధారపడి ఉంటుంది. లావాదేవీ రుసుం కూడా అధికంగా ఉండటంతోపాటు, ప్రక్రియ పూర్తి చేయడానికి అధిక సమయం పడుతుంది. రోజుకు రెండు బిలియన్ డాలర్ల (సుమారు రూ.13,000 కోట్ల) విలువైన బిట్కాయిన్లు ట్రేడ్ అవుతున్నాయి. ఈ విలువ రోజువారీ పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లకు సమానం. ఎలక్ట్రానిక్ చెల్లింపులకే ఉపయోగ పడుతున్నాయి. వీటి వినియోగ పరిధి తక్కువే. వాస్తవ లావాదేవీలు బిట్కాయిన్ల ద్వారా జరిగినా, ఆ మొత్తాన్ని ఆయా దేశాల కరెన్సీల్లోకి మార్చుకుంటారు. వీటి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కోసారి 10 రెట్లు తేడాలు కూడా ఉంటాయి. గత డిసెంబర్లోనే బిట్కాయిన్ ధరలో 40 శాతం తేడా వచ్చింది. బిట్కాయిన్లకు జపాన్ అనుమతివ్వగా, చైనా గట్టిగా నియంత్రిస్తోంది. దక్షిణకొరియా కూడా ఇటీవలే నియంత్రణలు తెచ్చింది. బ్రిటన్లో కూడా ఊహాజనిత కరెన్సీలను మార్చుకోవడం కష్టమవుతోంది. భారత్లో కూడా చట్టవిరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పలు దేశాలు తమ పెట్టుబడులకు ఆటంకంగా మారుతుందని భావిస్తే బిట్ కాయిన్ ట్రేడింగ్పై నిషేధం విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
డాలర్ విలువ తగ్గడం వల్లే పసిడికి డిమాండ్
దేశీయ మార్కెట్లో పసిడి ధర మళ్లీ పెరుగుతోంది. గురువారం దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.31,450కి చేరగా, హైదరాబాద్లో రూ.31,500 పలికింది. ఇది 14 నెలల గరిష్ఠస్థాయి. డాలర్ బలహీన పడి మూడేళ్ల కనిష్ఠ స్థాయికి చేరినందున, సురక్షితంగా ఉంటుందంటూ పసిడిపైకి పెట్టుబడులు మళ్లుతున్నాయని చెబుతున్నారు. దేశీయంగా ఆభరణాల వ్యాపారులు కొనుగోళ్లు జరుపుతున్నందున బంగారం ధర పెరిగిందని చెబుతున్నారు. వెండి ధర కూడా రూ.1,100 పెరిగి కిలో రూ.41,000కు చేరింది.