చర్యలు తీసుకోవద్దంటే రూ.10కోట్లు డిపాజిట్ చేయండి: ఐసీఐసీఐకి సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకుకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. నేషనల్ కన్జూమర్ కమిషన్లో రూ. 10కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా ఐసీఐసీఐ బ్యాంక్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ ఓ కో-ఆపరేటివ్ బ్యాంక్ను మోసం చేసిన కేసులో సుప్రీం ఈ తీర్పు చెప్పింది.
చర్యలు తీసుకోవద్దంటే..
కన్జూమర్ కమిషన్ ఆర్డర్పై స్టే విధించేందుకు జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. బ్యాంక్ ఆ మొత్తం డిపాజిట్ చేసిన తర్వాతే దానిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. బ్యాంక్పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఉండేందుకే ఈ డిపాజిట్ అని కూడా కోర్టు తేల్చి చెప్పింది.
అలా అయితేనే..
రెండు వారాల్లోగా ఈ డిపాజిట్ చేయాలని, అలా చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా ముంబై డిస్ట్రిక్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్కు వడ్డీ సహా రూ.10కోట్లు చెల్లించాలని ఈ ఏడాది మార్చిలో కన్జూమర్ కమిషన్ ఆదేశించింది.
నకిలీ పత్రాలో డబ్బు కాజేశాడు..
ఈ ఆదేశాలపై స్టే విధించాలంటూ ఐసీఐసీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. గతంలో ఇదే కో-ఆపరేటివ్ బ్యాంక్ ఐసీఐసీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో డబ్బును పెట్టుబడిగా పెట్టింది. అయితే, సదరు బ్యాంక్ మేనేజర్ నకిలీ పత్రాలతో ఆ డబ్బును కాజేశాడు.
ఉద్యోగి తప్పు చేసినా.. బాధ్యత బ్యాంకుదే...
ఈ కేసులో కో-ఆపరేటివ్ బ్యాంక్ వినియోగదారుడు కాదు.. వాణిజ్య లాభాల కోసమే డిపాజిట్ చేసిందంటూ ఐసీఐసీఐ చేసిన వాదనను కన్జూమర్ కమిషన్ కొట్టేసింది. తమ ఉద్యోగులు చేసినా.. ఆ తప్పుకు బాధ్యత వహించి ఆ మొత్తం బ్యాంకే చెల్లించాలని స్పష్టం చేసింది.