కరెన్సీ పరిస్థితి 2016 కన్నా దారుణం: ఆర్బీఐ సర్వే
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2016 కంటే దారుణంగా తయారైందని తాజాగా భారత రిజర్వు బ్యాంక్ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశ ప్రజల చేతిలో ఉన్న రికార్డు స్థాయిలో రూ.18.5 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్బీఐ గణాంకాలు తేల్చాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత కనిష్ఠ స్థాయి నమోదైన నాటితో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ చలామణీలోకి తెచ్చిన మొత్తం నగదు విలువ కూడా రెట్టింపు కన్నా ఎక్కువై, రూ.19.3 లక్షల కోట్లకు చేరింది. చలామణీలో ఉన్న మొత్తం నగదు నుంచి బ్యాంకుల్లోని సొమ్మును మినహాయిస్తే వచ్చే విలువను ప్రజల వద్ద ఉన్న నగదుగా పరిగణిస్తారు.
కొన్నాళ్ల కిందట దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర కొరత ఏర్పడింది. అక్రమంగా నగదును పోగు చేసుకోవడం వల్ల ఆ కృత్రిమ కొరత తలెత్తి ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. 2016 నవంబర్ 8న రూ.500, వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. నాడు చలామణీలో ఉన్న 86 శాతం సొమ్ము రద్దయింది. 2017 జూన్ 30 నాటికి రద్దయిన నోట్లలో 98.96 శాతం బ్యాంకుల్లో జమైంది.
ఆర్బీఐ వద్ద తాజాగా ఉన్న నగదు సరఫరా డేటా ప్రకారం.. మే 25 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ.18.5 లక్షల కోట్లు. పెద్దనోట్ల రద్దు తర్వాత 2016 డిసెంబర్ 9న జనం చేతిలో ఉన్న సొమ్ము రూ.7.8లక్షల కోట్లు. నాటితో పోలిస్తే ప్రస్తుత విలువ రెట్టింపు దాటింది. నోట్లరద్దుకు ముందు ప్రజల దగ్గరున్నది రూ.17లక్షల కోట్లు.
చలామణీలో ఉన్న మొత్తం సొమ్ము జూన్ 1 నాటికి రూ.19.3 లక్షల కోట్లు. ఏడాది కిందటితో పోలిస్తే ఇది 30 శాతం అధికం. 2017 జనవరి 6న 'చలామణీలో ఉన్న సొమ్ము' కనిష్ఠంగా రూ.8.9 లక్షల కోట్లు. నాటితో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువైంది. చలామణీలో ఉన్న మొత్తం నగదు విషయంలోనూ ఇదే పోకడ కనిపించింది. దీని కారణంగా నగదు లభ్యత సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది.