ఇంధన ధరలపై పన్నులు తగ్గిస్తే సంక్షేమ పథకాలు ప్రజలకు అందవు: మనోజ్ లాద్వా
దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోందంటూ విపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయి. ఇందుకు కారణం పడిపోతున్న రూపాయి విలువ అని విపక్షాలు చెబుతున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వాటి మార్కెట్లు చూస్తే వాటికంటే భారత్ కాస్త మెరుగైన పరిస్థితుల్లోనే ఉందని చెప్పారు ఇండియా ఐఎన్సీ వ్యవస్థాపకులు సీఈఓ మనోజ్ లాద్వా. రూపాయి విలువ పడిపోయినందుకు మోడీ ఆర్థిక వ్యవస్థపై పట్టుబిగించలేకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు చేస్తున్న ఆరోపణలు సరికావని ఆయన విశ్లేషించారు.
ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్లు కలిగి ఉన్న దేశాలను ఒకసారి చూస్తే... గత ఐదేళ్లలో అర్జెంటీనా కరెన్సీ పీసో విలువ 546 శాతం పడిపోయింది. టర్కీ కరెన్సీ లిరా 221శాతానికి పడిపోగా... బ్రెజిల్ రియల్ 84శాతం, దక్షిణాఫ్రికా ర్యాండ్ 51శాతం, మెక్సికన్ పీసో 47శాతం, ఇండోనేషియా రూపియా 28శాతం, మలేషియా రింగెట్ 27శాతం పడిపోయాయి. భారత్ కరెన్సీ రూపాయి 16శాతంకు మాత్రమే పడిపోయింది. అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ స్థానం బాగానే ఉందన్నారు మనోజ్ లాద్వా. ఇక అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో చైనా కరెన్సీ యాన్ మాత్రమే మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇది కేవలం 12శాతం మాత్రమే పడిపోయింది. ఇక కరెన్సీకి సంబంధించిన ప్రతిదీ అమెరికా డాలర్తో పోలుస్తాం కనుక... డాలర్ పరిస్థితి కూడా అంత బాగోలేదు. డాలర్ కూడా 18శాతం పడిపోయింది.
ప్రపంచ మార్కెట్ల పరిస్థితి ఇంత దారుణంగా తయారయ్యేందుకు ప్రధాన కారణం టర్కీ కరెన్సీ లిరా, రష్యా కరెన్సీ రూబెల్ పడిపోవడమేనని మనోజ్ చెబుతున్నారు.విదేశాలనుంచి భారీగా రుణం పొందడం, ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం, ద్రవ్యోల్బణం 18శాతం కావడంతోపాటు అమెరికాతో దౌత్య సంబంధాలు అంత బాగోలేకపోవడంతో టర్కీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఇదిలా ఉంటే అమెరికా బ్రిటన్లు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా రూబెల్ కూడా పతనమవుతూ వచ్చింది. రష్యా ఆర్థిక వ్యవస్థను చూసి పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను ఆదేశం నుంచి ఉపసంహరించుకుని పెట్టుబడులకు స్వర్గంగా భావిస్తున్న అమెరికా, పాశ్చాత్య యూరప్ దేశాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ప్రపంచస్థాయి మార్కెట్ల పతనంతో పోలిస్తే భారత్ చాలా మంచి పొజిషన్లో ఉందని మనోజ్ లాద్వా చెప్పారు. అంతేకాదు భారత్ కరెన్సీ విలువ కేవలం 16శాతానికే పడిపోయిందని ఇక అంతకుమించి పతనంకాకుండా భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించాల్సి ఉందని మనోజ్ తెలిపాడు. 2014లో మోడీ సర్కార్ బాధ్యతలు చేపట్టాక.. అప్పటి వరకు పడిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి జైట్లీతో కలిసి మోడీ పలు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. అదే నేడు మంచి ఫలితాలను ఇస్తోందని మనోజ్ అభిప్రాయపడ్డారు. 2018 తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 8,2శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదిలా ఉంటే ప్రపంచస్థాయి సంస్థలు వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్, రిజర్వ్ బ్యాంక్ సంస్థలు ఏడాదికి 7.4 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాయి. ఇది 8శాతం వరకు వెళ్లే అవకాశముందని తాను భావిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. జూలైలో ఇంధన ధరలు పెరిగినప్పటికీ కూడా ద్రవ్యోల్బణం 4.17శాతం ఉందని..ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ఇది 4.8శాతానికి చేరుకునే అవకాశం ఉందని అయినప్పటికీ ఆర్బీఐ పరిధిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక పెరుగుతున్న ఇంధన ధరలపై పన్నులు ఇతరత్రా సెస్లు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్న మనోజ్.. ఒకవేళ అవి తగ్గిస్తే ఆర్థిక ఇబ్బందులు మరింత జటిలం అవుతాయన్నారు. అంతేకాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సినంత బడ్జెట్ ఉండదని చెప్పారు. సరిగ్గా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న సమయంలో ఇంధన ధరలపై పన్నును తగ్గిస్తే మళ్లీ అంధకారంలోకి నెట్టివేయడం జరుగుతుందని చెప్పారు. అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా బలహీనమైన కరెన్సీతోనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని అన్నారని దానితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు మనోజ్ చెప్పారు.