ముడి చమురు, కర్ణాటక ఎఫెక్ట్: కుప్పకూలిన మార్కెట్లు, 301 కోల్పోయిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: ముడి చమురు ధరతో పాటు కర్ణాటకలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. శుక్రవారం నాటి మార్కెట్లో దేశీయ చూసీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 10,600 దిగువకు పడిపోయింది.
అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 80 డాలర్లకు చేరుకొంది. భారత ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నడుమ గురువారం నాటి ట్రేడింగ్ లో అమ్మకాలు చేపట్టిన మదుపర్లు కూడ అదే బాటలో నడిచాయి. వరుసగా నాలుగో రోజు కూడ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
మరోవైపు కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు క్షణక్షణానికి మారుతుండటం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో ఈ ఉదయం నుంచే సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
మార్కెట్ ఆరంభంలో 150 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ఆ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆద్యంతం అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ దిగజారిపోయింది. చివరకు 301 పాయింట్లు కోల్పోయి 34,848 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 86 పాయింట్ల నష్టంతో 10,596 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, టెక్మహింద్రా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హిందుస్థాన్ యునిలివర్, కొటక్ మహింద్రా బ్యాంక్ లాభపడగా.. సిప్లా, విప్రో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, సన్ఫార్మా, టాటామోటార్స్ షేర్లు నష్టపోయాయి.