అంతా పీఎంవో చేతుల్లోనే, నోట్ల రద్దు-జీఎస్టీలతో భారత్కు దెబ్బ: రఘురాం రాజన్
వాషింగ్టన్: భారత్లో అధికార కేంద్రీకరణ ఎక్కువగా ఉందని, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శలు గుప్పించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
రాజకీయ నిర్ణయాల్లో అధికార కేంద్రీకరణ మరీ ఎక్కువగా అయిందని, ఇదే భారత్కు ప్రధాన సమస్య అన్నారు. ఇటీవల ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే అందుకు ఉదాహరణ అన్నారు.
ఈ విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చిందని చెప్పారు. అధికార కేంద్రీకరణ రాజకీయ నిర్ణయాల్లో మరీ ఎక్కువ అన్నారు. సర్దార్ విగ్రహావిష్కరణలో ఉన్న వేగం అన్నింటా ఉండాలన్నారు. ప్రధాని కార్యాలయమే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. భారత్లో ప్రధాని కార్యాలయం అనుమతి లభిస్తే తప్పు ముందడుగు పడట్లేదన్నారు.
రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడే ప్రధానమంత్రిపై ఆధారపడే అన్నీ జరుగుతున్నాయన్నారు. సర్దార్ విగ్రహం అంశాన్ని ప్రస్తావిస్తూ ఏదైనా జరగాలి అని భావిస్తే దానిని చేసి తీరుతుందని, దీనిని ప్రతీ అంశంలోనూ మనం చూడలేమా అన్నారు. అధికార కేంద్రీకరణ ఎక్కువగా ఉండటంతో పాటు అధికారుల లేదా ఉద్యోగుల చేతిలో అధికారం లేకపోవడం కూడా మరో ప్రధాన సమస్య అన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు తాముగా ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నాయని చెప్పారు. అవినీతి కుంభకోణాలు బయటపడుతున్నప్పటి నుంచీ ఉద్యోస్వామ్యం వెనకడుగు వేసిందని విమర్శించారు. నోట్ల రద్దు భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అడ్డుకుంటోందన్నారు. నోట్ల రద్దుతో పాటు జీఎస్టీ ప్రభావం భారత్ పైన బాగా పడ్డాయన్నారు.