బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్: రఘురామ్ రాజన్ వైపు చూపు, ఒకే చెప్పేనా?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ యూకే సెంట్రల్ బ్యాంకుగా గుర్తింపు పొందిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో కీలక బాధ్యతలను చేపట్టే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. బీఓఈ తదుపరి గవర్నర్ రేసులో రాజన్ పేరు కూడ విన్పిస్తోంది.
రఘురామ్ రాజన్కు అంతర్జాతీయ ఆర్ధిక అంశాలపై మంచి అవగాహన ఉంది. ఆర్బీఐ సాధించిన విజయాల్లో రఘురామ్ రాజన్ కీలకంగా వ్యవహరించడంతో పాటు ఇతర అంశాలను యూకే సెంట్రల్ బ్యాంకు పరిగణనలోకి తీసుకొంది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్నే త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి గవర్నర్ పదవి కేసు యూకే బ్యాంకు ప్రముఖ ఆర్ధిక వేత్తల పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో రఘురామ్ రాజన్ పేరు కూడ ప్రముఖంగా విన్పిస్తోంది.
యూకే కోశాగార ఛాన్స్లర్ ఫిలిప్ హమాండ్ ఇప్పటికే ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు రేసులో ఉన్నారని సమాచారం. అయితే ఇందులో రాజన్ రేసులో ముందున్నారని సమాచారం.
2013లో రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 2014లో అంతర్జాతీయ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అవకాశం వచ్చినప్పటికీ రాజన్ ఆర్బీఐతోనే ఉన్నారు. 2016లో ఆయన పదవి కాలం పూర్తయింది.
ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారని కూడ ప్రచారం జరిగింది. కానీ, రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని ఆయన తేల్చిచెప్పేశారు. యూకే బ్యాంకు పగ్గాలు చేపట్టే విషయమై రఘురామ్ రాజన్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారో చూడాలి.