నాలుగేళ్ల కనిష్టానికి వృద్ధిరేటు: 2017-18 జీడీపీ అంచనా 6.5శాతం
న్యూఢిల్లీ: భారత వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్టానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు మందగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2017-18లో మన జీడీపీ ప్రగతి 6.5 శాతానికి పరిమితం కానుందని.. కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) ముందస్తుగా అంచనా వేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.1 శాతం పురోగతి సాధించింది. జీడీపీ నుంచి నికర పన్నులను మినహాయించగా.. జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) వస్తుంది. 2016-17లో జీవీఏ వృద్ధి 7.1 శాతంగా ఉంది. కాగా, ప్రస్తుత ఏడాది అది 6.7 శాతానికి తగ్గనుందని తెలుస్తోంది. ఆర్బీఐ అంచనాల కంటే ప్రభుత్వ అంచనాలు తక్కువగా ఉండటం గమనార్హం.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యవసాయ రంగ పురోగతి తక్కువగా ఉందని సీఎస్వో తెలిపింది. గత ఏడాది వ్యవసాయం, అనుంబంధ రంగాలు 4.9 శాతం వృద్ధి చెందగా.. ఈసారి అది 2.1 శాతానికే పరిమితమైంది. ఉత్పత్తి రంగం పురోగతి కూడా 7.9 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిసిటీ అండ్ ట్రేడ్, హోటల్ రంగాల్లు మాత్రమే వృద్ధి బాటలో సాగాయి. గత ఏడాది ఈ రంగాలు 7.5 శాతం చొప్పున అభివృద్ధి చెందగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 8.7 శాతంగా ఉంది. ఆర్థిక శాఖ బడ్జెట్ కోసం కసరత్తు చేస్తున్న తరుణంలో వెలువడిన ఈ అంచనాలు కీలకంగా మారాయి.