15 నెలల గరిష్ఠానికి పసిడి ధర.. డాలర్ పతనంతో ఇలా ఆందోళన
ముంబై: అమెరికా, చైనా పరస్పరం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం నెలకొన్నది. దీంతో బంగారం ధర 15 నెలల గరిష్టానికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువ కావడంతో పసిడి ధర ఏడాది గరిష్ఠానికి చేరింది. శనివారం నాటి మార్కెట్లో రూ.85 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,835గా ఉంది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 39,600గా ఉంది.
బంగారంపై పెట్టుబడులకు మదుపర్ల ఆసక్తి
చైనాపై అమెరికా వాణిజ్య ఆంక్షలు పెట్టడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మదుపర్లు రక్షణాత్మక ధోరణిలో వ్యవహరిస్తూ బంగారంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరిగాయి. న్యూయార్క్లో శుక్రవారం నాటి మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.37శాతం పెరిగి 1,346.80డాలర్లు పలికింది. వెండి కూడా 1.13శాతం పెరిగి ఔన్సు ధర 16.53 డాలర్లుగా ఉంది.
ఎన్ఎస్ఏగా జాన్ బోల్డన్ నియామకంతో పెరిగిన నష్టభయం
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాల కారణంగా డాలర్ విలువ కూడా పతనమైంది. దీంతో మదుపరుల్లో ఆందోళన మొదలైంది. దౌత్యవేత్త, అటార్నీ జాన్ బోల్టన్ను తన కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించడంతో మార్కెట్లో నష్టభయం (రిస్క్) మరింత పెరిగింది.
అమెరికా, చైనా మధ్య సుంకాల విధింపు ఆందోళనే
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటే అది ప్రపంచ ఆర్థిక రంగ రికవరీకి విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘ఈ విషయంలో ఆందోళన కలిగించే ఎన్నో అంశాలు ఉన్నాయి. దీన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం'' అని రాజన్ పేర్కొన్నారు. అయితే, ఒక దేశం చర్యకు, మరో దేశం ప్రతిస్పందించే విధానం నుంచి బయటపడతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వాణిజ్య యుద్ధం అనే పదాన్ని వినియోగించడం ఇష్టం లేదు. ఎందుకుంటే వారు ఇంకా ఆ దశలో లేరు. ఈ విధమైన చర్యలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక రంగ రికవరీకి హాని కలుగుతుంది. అమెరికా పూర్తి బలంగా ఉండి, ఉద్యోగాలు తగినన్ని ఉన్న తరుణంలో ఈ విధంగా చేయడం సరికాదని భావిస్తున్నా'' అని రాజన్ అన్నారు.
నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్న కేంద్రమంత్రి
అమెరికా రక్షణాత్మక చర్యలతో ప్రపంచం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎగుమతుల పెంపునకు మార్గాలను అన్వేషించాలని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. చైనా సహా తన వాణిజ్య భాగస్వాములకు వ్యతిరేకంగా అమెరికా కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ‘‘నిబంధనలకు లోబడి, పారదర్శక, భాగస్వామ్య వాణిజ్య విధానాన్ని భారత్ బలంగా విశ్వసిస్తుంది. ఒకవేళ ఏ దేశమైనా ఏకపక్షంగా చర్యలకు దిగితే దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తగిన రీతిలో ఎదుర్కొంటాం''అని ప్రభు స్పష్టం చేశారు. ఎగుమతుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్త మార్కెట్లు, కొత్త ఉత్పత్తులకు అవకాశాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు.
వాణిజ్య ఘర్షణ తగ్గింపుతోనే మేలు
ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు ఆవరిస్తుండటంతో వాటిని తగ్గించేందుకు భారత్ చురుకైన పాత్ర పోషించాలని ఫిక్కి కోరింది. ప్రపంచ వాణిజ్య ప్రగతిని అవి దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా రక్షణ విధానాలు వాణిజ్య ఘర్షణకు తెరతీసిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) విధానాలను కొనసాగించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఓ ముఖ్య దేశంగా భారత్కు ప్రపంచ దేశాల్లో ఆమోదం పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీవో బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించింది.
కనిష్క్ గోల్డ్ సీఏలపైనా పీఎంఎల్ఏ కేసులు
చెన్నైలో బ్యాంకులకు రూ. 824 కోట్ల మేర ఎగవేసిన కనిష్క్ గోల్డ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ప్రమోటర్లు, మరికొందరిపై ఇప్పటికే సిబిఐ చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారీ రుణాల ఎగవేతలో మనీలాండరింగ్ కూడా జరిగినట్టు ఈడీ భావిస్తోంది. ప్రమోటర్ డైరెక్టర్లు భూపేష్ కుమార్ జైన్ ఆయన భార్య నీతా జైన్తోపాటు చార్టర్డ్ అకౌంటెంట్లు తేజ్రాజ్ అచ్ఛా, అజయ్కుమార్ జైన్, సుమిత్ కేడియాపై కూడా పిఎంఎల్ఎ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తన 10 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తామని చెప్పి పత్రాలను తీసుకున్న భూపేష్ జైన్ వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి 42 కోట్ల రూపాయల రుణం తీసుకొని తనను మోసం చేశారని పుహళేంది అనే వ్యాపారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.