ఐదో రోజూ తగ్గిన బంగారం ధరలు: డిమాండ్ పడిపోయిందా?
న్యూఢిల్లీ: బంగారం ధరలు వరుసగా ఐదో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయంగా ట్రెండ్ స్తబ్దుగా ఉండటం, స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ లేకపోవడంతో గురువారం 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్లో 140 రూపాయలు తగ్గి, రూ.31,210గా నమోదైంది.
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కేజీకి 470 తగ్గినట్టు తెలిసింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,030గా రికార్డైంది. పారిశ్రామిక యూనిట్ల నుంచి, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్థిరంగా కొనసాగింది. ఒక్క ఔన్స్కు 1,243 డాలర్లు నమోదైంది. బుధవారం 1 శాతం కిందకి పడిపోయిన బంగారం, వారం కనిష్ట స్థాయిలను తాకింది.
ఆగస్టు నెల అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం నష్టంలో ఔన్స్కు 1,243.60 డాలర్లుగా నమోదైనట్టు తెలిసింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం బలహీనమైన గ్లోబల్ ట్రెండ్, స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ పడిపోవడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.