‘తేజ్’ ఇకపై ‘గూగుల్ పే’: కొత్త ఫీచర్లు, ఇప్పుడు ఇన్స్టాంట్ బ్యాంక్ లోన్స్ కూడా!
Recommended Video
న్యూఢిల్లీ: గూగుల్ పేమెంట్స్ సర్వీస్ 'తేజ్' ద్వారా ఇప్పుడు మొబైల్ ఫోన్ల ద్వారా నగదు ఇతరులకు పంపించుకోవడం ఎంతో తేలికగా మారింది. అంతేగాక, పంపించడం లేదా స్వీకరించిన వారికి కూపంల రూపంలో కొంత సొమ్ము కూడా ఈ యాప్ ద్వారా పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ యాప్ చాలా పాపులర్ అయిపోయింది. కాగా, తాజాగా ఈ తేజ్ యాప్ పేరును 'గూగుల్ పే'గా మార్చనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
పేరు మాత్రమే మారింది.. కానీ..
ఢిల్లీలో జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా 2018' కార్యక్రమంలో గూగుల్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మరికొన్ని కొత్త సర్వీసులను కూడా ఇందులో ప్రవేశపెట్టింది. సులువుగా యూపీఐ పేమెంట్స్ చేసుకునేందుకు వీలున్న ‘తేజ్' పేరు మార్చినప్పటికీ యాప్లో ఎలాంటి మార్పులూ ఉండవని గూగుల్ పేర్కొంది.
కొత్త ఫీచర్లు ఇవే..
తేజ్ పేరు మాత్రమే ‘గూగుల్ పే'గా మారుతోంది. ఎప్పటిలానే హోం స్క్రీన్, బిల్ పేమెంట్స్, కాంటాక్ట్స్ వంటివి ఉంటాయి. వీటితో పాటు మరిన్ని ఆన్లైన్ పేమెంట్లకు వీలుగా ఆన్లైన్, ఇన్ స్టోర్ ఆప్షన్స్ను కొత్తగా గూగుల్ తీసుకొస్తోంది.
లోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు..
దీంతో పాటు ప్రీ అప్రూవ్డ్ లోన్స్కు యాప్ ద్వారా అప్లై చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి బ్యాంకులతో ఒప్పందం చేసుకోనుంది. తదుపరి అప్డేట్లో పేరుతో పాటు మరికొన్ని ఫీచర్లు యాప్లో అందుబాటులోకి రానున్నాయి.
ప్రమోషనల్ కూపన్స్ కొనసాగుతాయి..
మరోవైపు ‘గూగుల్ పే'ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ ఈ సందర్భంగా ప్రకటించింది. ప్రస్తుతం భారత్లో 2.2కోట్ల మంది ఈ యాప్ను వినియోగిస్తున్నారని గూగుల్ వెల్లడించింది. గత సెప్టెంబర్లో యాప్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 75 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. ఎప్పటిలానే ప్రమోషనల్ కూపన్స్ కొనసాగుతాయని ఈ సందర్భంగా గూగుల్ స్పష్టతనిచ్చింది.