మార్కెట్ సరికొత్త రికార్డులు: సెన్సెక్స్ 37,000, నిఫ్టీ 11,250
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్(బీఎస్ఈ) సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా 37వేల మార్క్ పైన స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజ్(నిఫ్టీ) కూడా 11,200పైన ముగిసింది.
అంచనాలను మించి కంపెనీల త్రైమాసిక ఫలితాలు నమోదవడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు పెరగడం, రూపాయి బలపడటం.. దేశీయ మార్కెట్ సెంటిమెంట్కు కలిసొచ్చాయి. దీంతో లోహా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
ఈ పరిణామాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్లో సూచీలు జోరుగా సాగాయి. శుక్రవారం ఉదయం నుంచి కూడా రికార్డు స్థాయిలో మార్కెట్లు పరుగులు పెట్టడం గమనార్హం. ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడింగ్ను మొదలుపెట్టిన సెన్సెక్స్.. ఆద్యంతం ఆ జోరు కొనసాగింది. కొనుగోళ్ల మద్దతుతో 300పాయింట్లకు పైగా ఎగబాకింది.
చివరకు 352పాయింట్లు లాభపడి 37,337 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 111పాయింట్లు లాభపడి 11,278వద్ద స్థిరపడింది. కాగా, డాలర్తో రూపాయి మారకం విలువ రూ.68.71గా కొనసాగుతోంది.