డిప్యూటీ జీఎం రిటైర్మెంట్తోనే వెలుగులోకి పీఎన్బీ ‘నయామోసం’
ముంబై: గతవారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో మోసం జరిగినట్లు వార్త బయటకు రావడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. బూటకపు 'లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ) పేరిట రూ.11,400 కోట్ల మేరకు నీరవ్ మోదీ సంబంధిత సంస్థలకు రుణాలు మంజూరు చేయడంలో పీఎన్బీ ముంబైలోని బ్రాడీ హౌస్ శాఖలో డిప్యూటీ మేనేజర్గా పని చేసిన గోకుల్నాథ్ శెట్టి రిటైర్మెంట్ కీలక పాత్ర పోషించారు. ఏడేళ్ల పాటు బ్యాంక్ 'స్విఫ్ట్' ఇన్చార్జీగా పని చేసి రిటైరైన ఆయనదే బాధ్యత.
ఆయన ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆ వ్యవహారం నడుపుతూ వచ్చారా? దర్యాప్తు సంస్థలకు బ్యాంకు వర్గాలు తెలిపిన వివరాల సమాచారం చూస్తే దీనికి ఔననే సమాధానమే వస్తుంది. గోకుల్ నాథ్ శెట్టి గతేడాది మే 31వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. కానీ గతేడాది మార్చి ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు చెల్లుబాటు అయ్యేలా బ్యాంకు ద్వారా 143 భరోసా పత్రాలు (ఎల్వోయూలు) జారీ అయ్యాయి.
100 శాతం మార్జిన్ మనీ డిపాజిట్ చేయాలని డీజీఎం సూచన
ఆయన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన నూతన డిప్యూటీ మేనేజర్ వద్దకు వచ్చి నీరవ్ మోదీ సంబంధిత సంస్థల ప్రతినిధులు ఎల్వోయూ కోసం గత నెల 16వ తేదీన సంప్రదించారు. దీనికి సంబంధిత పీఎన్బీ నూతన డిప్యూటీ జనరల్ మేనేజర్ 100 శాతం మార్జిన్ డిపాజిట్ చేయాలని సూచించారు. దీనికి ప్రతిగా సదరు ప్రతినిధులు గతంలో ఇలా మార్జిన్ మనీ డిపాజిట్ చేయకుండానే ఎల్వోయూలు పొందామని చెప్పారు. కానీ ఆ డిప్యూటీ జనరల్ మేనేజర్ మాత్రం అందుకు నిరాకరించారు. నీరవ్ మోదీ తదితరుల మాయలో పడటానికి ముందుకు రాలేదు. ఈ సంగతిపై బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందించారు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్విఫ్ట్ మెసేజ్లో అమలు గానీ విధి విధానాలు
పీఎన్బీ ముంబైలోని బ్రాడీ హౌస్ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్నాథ్శెట్టి గతంలో నీరవ్ మోదీ ఎల్వోయూలు జారీ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఎల్వోయూల సాయంతో సదరు నీరవ్ మోదీ కంపెనీలకు అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ విదేశీ శాఖల ద్వారా రూ.280.7 కోట్ల మేరకు నిధులు చేతులు మారడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. కానీ స్విఫ్ట్ మెసేజ్లు పంపడంలో ఎటువంటి విధి, విధానాలు పాటించలేదని పోలీసు విచారణలో తేలింది.
360 రోజులకు ఎల్వోయూలు జారీ చేసిన డీజీఎం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ముంబైలోని బ్రాడీ హౌస్ శాఖలో గోకుల్నాథ్ శెట్టి పనిచేశారు. అక్కడే ఉన్న మరో అధికారి మనోజ్ హేమంత్ కారాట్తో కలిసి గీతాంజలి గ్రూపు కంపెనీలకు రూ.4886.72 కోట్ల మేర ఎల్వోయూలు, విదేశీ రుణ పత్రాలు (ఎఫ్ఎల్సీలు) జారీ చేయడంలో ఆ అధికారి కీలక పాత్ర వహించినట్లు బ్యాంకు ఫిర్యాదు చెబుతోంది. భరోసా పత్రాలను 90 రోజుల కాలానికే ఇవ్వాలి. శెట్టి, కారాట్ కలిసి వీటిని 360 రోజులకు జారీ చేసేశారు. ఇవేవీ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్లో నమోదు కాకుండా చూశారు.
ఎల్వోయూల జారీ వెనుక ఉన్న వారెవ్వరు?
ఎఫ్ఎల్సీల జారీ కోసం తొలుత తక్కువ మొత్తం నమోదు చేయడం ద్వారా ఒక సూచిక సంఖ్య (రిఫరెన్స్ నంబర్)ను సృష్టించి, ఆ తర్వాత స్విఫ్ట్ లావాదేవీ ద్వారా దాన్ని గోకుల్ నాథ్ శెట్టి పెంచేవారు. పీఎన్బీలోని కంప్యూటర్ వ్యవస్థలో అది నమోదు కాకుండా చూసుకునేవారు. పెంచిన మొత్తం ప్రకారమే విదేశాల్లో చెల్లింపులు జరిగేవి. జారీ చేసిన వాటిలో ఆరు పత్రాలు ఈ ఏడాది జూన్, జూలైల్లోనూ చెల్లుబాటయ్యేలా చూపడం విశేషం. శెట్టి రిటైరయ్యాక వీటిని ఎవరు ఆమోదించారనేది దర్యాప్తు సంస్థలకు బ్యాంకు వర్గాలు వివరించలేకపోయాయి. వేర్వేరు మొత్తాల్లో ఉన్న ఈ ఆరింటి విలువ 65.12 లక్షల డాలర్లు (సుమారు రూ.41.68 కోట్లు). మొత్తం ఆ వ్యవహారాన్ని ఇద్దరే నడిపారా, అంతకంటే ఎక్కువమంది ఉన్నారా అనేది తేలాల్సి ఉంది.