ఐటీ రిటర్న్స్పై బోగస్ క్లెయిమ్స్: రూ.1000 కోట్లకు ప్రభుత్వోద్యోగుల టోకరా
ముంబై/ బెంగళూరు: మొన్న పీఎన్బీ కుంభకోణం.. నిన్న కార్పొరేట్ల మాయాజాలం.. నేడు ప్రభుత్వ ఉద్యోగుల అతి తెలివి. కారణాలేమైనా.. వరుసగా వెలుగు చూస్తున్న మోసాలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో రూ. 1,000 కోట్ల మోసాన్ని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ బయట పెట్టింది. మూడు రోజుల క్రితం 447 సంస్థలు.. రూ.3,200 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఘరానా మోసాన్ని ఐటీ అధికారులు కనిపెట్టారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ఉద్యోగుల వల్ల కలిగిన వెయ్యి కోట్ల నష్టాన్ని గుర్తించినట్లు రెండు రోజుల క్రితం వెల్లడైంది.
2016-17 మదింపు సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్నుల సవరణ (రివైజ్)కు గడువు దగ్గర పడుతుండటంతో వివిధ నగరాల్లో జరిగిన ఈ భారీ మోసాన్ని ఐటీ శాఖ తమ విచారణలో కనుగొన్నది. నకిలీ ధ్రువపత్రాలు, ఖర్చులు ఎక్కువగా చూపి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెద్ద ఎత్తున ట్యాక్స్ రిఫండ్స్ (పన్నుల వాపసు)కు క్లెయిమ్ చేసుకున్నారు.
బెంగళూరులో గృహ రుణాల చెల్లింపులపై వెయ్యి రిటర్న్స్
ఒక్క ముంబైలోనే దాదాపు 17వేల రివైజ్డ్ రిటర్నులు దాఖలు కావడం గమనార్హం. గృహ రుణాలకు చెల్లింపుల కారణంతో బెంగళూరులో ఇంకో వెయ్యి రిటర్నుల్ని క్లెయిమ్ చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీకి పన్నుల నుంచి మినహాయింపున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ విచారణ కొనసాగుతుండగా, దీంతో ఐటీ శాఖకు కనీసం రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది.
లెక్కల్లోకి రాని సంపద వెలికితీతపై సీబీఐ నజర్
మరోవైపు లెక్కల్లోకి రాని సంపదను వెలికి తీయడంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అన్ని వివరాల్ని ఐటీ శాఖ అందిస్తున్నది. కాగా, ఈ క్లెయిమ్లలో ఎక్కువగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని సిబ్బందివే ఉన్నాయని ఐటీ శాఖ తెలిపింది. వీరందరి వాస్తవ రిటర్నులను ఇప్పటికే ఐటీ శాఖకు చెందిన కేంద్రీకృత ప్రాసెసింగ్ సెంటర్ పరిశీలించిందని, కానీ సవరించిన రిటర్నుల్లో రిఫండ్స్ కోసం సంబంధిత డాక్యుమెంట్లనూ జోడించారని ఐటీ శాఖ అధికారి ఒకరు అంటున్నారు.
1.62 కోట్ల మంది టాక్స్ పేయర్స్ కు రూ.1.42 లక్షల కోట్లు రీ ఫండ్
గత మూడేళ్లలో రివైజ్డ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలు గణనీయంగా పెరిగిందంటున్న సదరు అధికారి.. ఎలా నకిలీ ధ్రువపత్రాలతో రిఫండ్స్ కోసం దరఖాస్తు చేస్తున్నారో కూడా తాము కనుగొన్నామని చెప్పారు. ఇక పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాల రివైజ్డ్ రిటర్నులను ఈ ఏడాది చివరికల్లా దాఖలు చేసుకోవచ్చన్నారు. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు ఈ నెల 31 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాగా, గత నెల ఫిబ్రవరి 10వ తేదీ వరకు 4.19 కోట్లకు పైగా ఐటీ రిటర్నుల్ని పరిశీలించి.. 1.62 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.1.42 లక్షల కోట్లు మేర రిఫండ్స్ను ఐటీ శాఖ అందజేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రీ ఫండ్స్లో 90 శాతం వేతన జీవులవే
సాధారణంగా రూ.50వేల లోపు రిఫండ్స్ చేసుకునే చిన్న పన్ను చెల్లింపుదారులకే ఐటీ శాఖ ప్రాధన్యం ఇస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లోనూ ఇప్పటివరకు జారీ అయిన రిఫండ్స్ల్లో 90 శాతం వేతన జీవులు, చిన్న ట్యాక్స్పేయర్లకు చెందినవే. ముందుగా చెల్లించిన పన్నుల మొత్తాల్లో.. నిర్దేశిత సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు చూపిస్తే, పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ తిరిగి చెల్లించేవే రిఫండ్స్ అన్న సంగతి విదితమే.
45 రోజుల్లో పాస్ పోర్టుల వివరాలు సేకరించాలని ఆదేశం
భారీగా రుణాలు పొందిన కార్పొరేట్ సంస్థల యజమానులకు చెందిన పూర్తి వివరాలను సేకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా మాదిరిగా మోసం చేసిన కార్పొరేట్ సంస్థల అధినేతలు దేశం విడిచి పారిపోకుండా సకాలంలో చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. రూ.50 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారి పాస్పోర్టుల వివరాలను వచ్చే 45 రోజల్లో సేకరించాలని ఆ వర్గాలు చెప్పాయి.
పాస్ పోర్టు వివరాలు తెలిపే నిబంధన చేర్చాలని బ్యాంకర్లకు కేంద్రం అడ్వైజరీ
ఒకవేళ రుణ గ్రహీతకు పాస్ పోర్టు లేకపోతే.. పాస్ట్ పోర్టు లేదని పేర్కొంటూ వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని బ్యాంకర్లకు పంపిన అడ్వైజరీలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్నది. రుణ గ్రహీతల పాస్ పోర్టుల వివరాలను వారి అప్లికేషన్ పత్రాల్లోనే చేర్చేలా నిబంధనలు చేర్చాలని పేర్కొంది. తద్వారా రుణ గ్రహీతలు ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నది.
స్పెక్ట్రం కొనుగోలు ఫీజు చెల్లింపునకు గడువు
రుణ భారంతో ఉన్న టెలికం రంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీకి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెక్ట్రం కొనుగోలు చేసిన కంపెనీలు అందుకు సంబంధించిన ఫీజు చెల్లింపులకు మరింత వ్యవధి ఇవ్వడం ఇందులో ప్రధానమైంది. అలాగే, స్పెక్ట్రం హోల్డింగ్ గరిష్ట పరిమితిని కూడా సరళీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్ మంత్రిత్వ శాఖల బృందం చేసిన సిఫారసుల మేరకు ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టారిఫ్ల క్షీణతతో లాభాలు అడుగంటిపోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న టెలికం రంగంపై అధ్యయనానికి కేంద్రం పలు శాఖలతో కూడిన అధికారులతో కమిటీని గతేడాది ఏర్పాటు చేసింది.
టెలికం కంపెనీలు 15 ఏళ్లలోపు స్పెక్ట్రం ఫీజు చెల్లించొచ్చు
స్పెక్ట్రం ఫీజుల చెల్లింపునకు 10 ఏళ్లుగా ఉన్న గడువును 15 ఏళ్లకు పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేయగా దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశీయ టెలికం రంగం ప్రస్తుతం రూ.4.6 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తోంది. చెల్లింపులకు అదనపు సమయం ఇవ్వడం వల్ల వాటికి నిధుల లభ్యత పెరుగుతుందని, స్పెక్ట్రం పరిమితిని సరళీకరించడం వల్ల స్థిరత్వం ఏర్పడి భవిష్యత్ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.