కార్పొరేట్ల కక్కుర్తి: ‘టీడీఎస్’ సొమ్ము రూ.3200 కోట్లు స్వాహా.. లిస్ట్లో 447 కంపెనీలు
న్యూఢిల్లీ:
కాదేది
కవితకు
అనర్హం
అన్నారో
మహాకవి.
ఇప్పుడు
లేదేది
దోచుకోవడానికి
మినహాయింపు
అని
నిరూపిస్తున్నాయి
కార్పొరేట్
సంస్థలు.
కార్పొరేట్
సంస్థల
ఘరానా
మోసం
బట్టబయలైంది.
ఫలానా
రంగం
అనే
తేడా
లేకుండా
అన్ని
రంగాల్లో
తవ్విన
కొద్దీబయట
పడుతున్నాయి
కార్పొరేట్ల
మాయాజాలాలు.
ఇప్పటిదాకా
బ్యాంకులకు
వేల
కోట్లు
కుచ్చుటోపి
పెట్టిన
సంస్థలు
తమ
కిలాడీ
తనాన్ని
ఐటీ
శాఖ
ఆదాయానికి
ఎసరు
పెట్టేందుకు
ప్రదర్శించిన
బాగోతం
బయట
పడింది.
ఆదాయం
పన్ను
(ఐటీ)
శాఖ
సర్వేలో
రూ.3,200
కోట్ల
టీడీఎస్
కుంభకోణం
వెలుగుచూసింది.
టీడీఎస్ స్కాంపై లోతుగా ఐటీ అధికారుల విచారణ
ఉద్యోగుల జీతాల్లోంచి పన్నుల పేరుతో మినహాయించుకున్న కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి చెల్లించకుండా.. 447 కార్పొరేట్ సంస్థలు సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నిర్మాణ, సినీ, ఐటీ, మౌలిక రంగాల సంస్థలు ఈ కుంభకోణంలో ఉన్నట్లు తెలుస్తుండగా, ఈ వ్యవహారంపై ఐటీ శాఖ లోతుగా విచారణ చేపడుతున్నది.
సిబ్బంది వేతనాల నుంచి టీడీఎస్ ఇలా కత్తిరింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) షాక్ నుంచి డిపాజిటర్లు ఇంకా తేరుకోకముందే.. తాజా టీడీఎస్ స్కాం ట్యాక్స్ పేయర్లకు స్ట్రోక్ ఇచ్చింది. ఉద్యోగుల జీతాల్లోంచి పన్నుల పేరిట కత్తిరించుకున్న సొమ్మును.. ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా స్వాహాచేసిన వైనం వెలుగులోకి వచ్చింది మరి. కార్పొరేట్ల ఘరానా మోసాన్ని సోమవారం ఐటీ శాఖ బయటపెట్టింది.
రాజకీయ అండ ఉంటే రూ.100 కోట్ల వరకు స్వాహా
రూ.3,200 కోట్ల పన్ను చెల్లింపులను 447 సంస్థలు పక్కదారి పట్టించాయి. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించకుండా.. తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఖర్చు చేశాయని అధికారులు గుర్తించారు. నిర్మాణ, సినీ, మౌలిక, ఐటీ రంగాల సంస్థలతోపాటు స్టార్టప్లు ఈ టీడీఎస్ కుంభకోణంలో ఉన్నట్లు సమాచారం. బలమైన రాజకీయ సంబంధాలు కలిగిన బిల్డర్లు కొందరు రూ.100 కోట్ల వరకు తమ స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు తెలుస్తున్నది.
సొంతానికి వాడేసుకున్న సంస్థలను గుర్తించిన ఐటీ శాఖ
మరో మౌలిక రంగ సంస్థ రూ.14 కోట్లను, ఐటీ సేవల్ని అందించే ఇంకో బహుళజాతి కంపెనీ రూ.11 కోట్లను పక్కదారి పట్టించినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే తమ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చే జీతాల్లో పన్నుల్ని మినహాయించుకుంటున్న సంస్థలు.. ఆ సొమ్మును విధిగా ఐటీ శాఖకు చెల్లించడానికి బదులు సొంతానికి వాడేసుకున్నట్లు ఆదాయం పన్ను శాఖ గుర్తించింది.
గతేడాది ఏప్రిల్ నుంచి మార్చి వరకు వేతనాల్లో కోత
ఐటీ శాఖలోని టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విభాగం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2017-18) తనిఖీల కోసం నిర్వహించిన ఈ వెరిఫికేషన్ సర్వేలోనే దాదాపు 447 కంపెనీల అక్రమాలు బయట పడ్డాయి. నిరుడు ఏప్రిల్ నుంచి ఈ మార్చి వ్యవధికి ఈ సంస్థలన్నీ తమ ఉద్యోగుల వేతనాల్లో రూ.3,200 కోట్లను పన్నుల పేరుతో కోత పెట్టాయి. ఈ సొమ్మును ఆయా కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించలేదని టీడీఎస్ అధికారులు తమ సర్వేలో గుర్తించారు.
కార్పొరేట్లు హద్దు మీరారంటున్న ఐటీ శాఖ అధికారులు
ఆదాయం పన్ను చట్టం కింద ప్రభుత్వం తరఫున టీడీఎస్ను వసూలు చేసి నిర్దేశిత వ్యవధిలో సదరు సొమ్మును ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాల్సిన చట్టపరమైన బాధ్యత సంస్థలపై ఉన్నదని, కానీ స్వప్రయోజనాలకు ఆ సొమ్మును వినియోగించి చట్టాన్ని కార్పొరేట్లు మీరారని ఐటీ శాఖ చెబుతున్నది. ఈ-పేమెంట్ల ద్వారా కూడా టీడీఎస్ వసూళ్లను డిపాజిట్ చేయవచ్చని, ఏదైనా బ్యాంక్ శాఖలో భౌతికంగా కూడా చెల్లింపులు జరుపవచ్చని పేర్కొంటున్న అధికారులు.. డిజిటలైజేషన్తో మోసాలు కొంతమేర తగ్గాయనే అంటున్నారు.
50 శాతం బకాయిలు చెల్లించిన సంస్థలు
ఉద్యోగుల్ని మోసం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఈ సంస్థలపైనా ఐటీ చట్టంలోని సెక్షన్ 276 బీ కింద ఐటీ శాఖ విచారణ చేపడుతున్నది. చీటింగ్, కుట్ర వంటి ఐపీసీ సెక్షన్లనూ మోపాలని చూస్తున్నది. ఇక కొన్ని సంస్థలకు ఇప్పటికే వారెంట్లనూ ఐటీ శాఖ జారీ చేసింది. రావాల్సిన బకాయిలను వసూలు చేసే చర్యలకూ దిగుతున్నది. కొన్ని సంస్థలు 50 శాతం డిపాజిట్ చేయగా, మిగతా మొత్తాల్ని వ్యాపార అభివృద్ధికి వినియోగించుకున్నట్లు తేలింది. ఐటీ చట్టం ప్రకారం ఈ నేరాలన్నింటికీ జరిమానాతోపాటు కనిష్ఠంగా మూడు నెలలు, గరిష్ఠంగా ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
టీడీఎస్ జమ చేయకుంటే చేతి నుంచి కట్టాల్సిందే
టిడిఎస్ కట్ చేసిన తర్వాత సంస్థ ఐటి శాఖకు జమచేస్తే రిటర్న్ దాఖలు చేసేప్పుడు ఉద్యోగులకు ఇబ్బంది ఉండదు. టిడిఎస్ జమ చేయని పక్షంలో రిటర్న్స్లోని లెక్కలకు వాస్తవిక లెక్కలకు మధ్య పొంతన కుదరదు. నెలవారి జీతంలో సంస్థ ఆ మొత్తాన్ని మినహాయించి (టిడిఎస్) ఐటి శాఖకు చెల్లించిన పక్షంలో ఉద్యోగి రిటర్న్ దాఖలు చేసేప్పుడు పైసా కూడా చెల్లించనక్కరలేదు. చెల్లించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల ఉద్యోగి ఖాతాలో పన్ను బకాయిలు ఉన్నట్టుగా ఐటీ శాఖ వెబ్సైట్లో కనిపిస్తుంటుంది. దీన్ని పట్టించుకోకపోతే చివరకు మీ జేబుల్లోంచే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ఐటీ శాఖతో వివాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.
ఎస్సెమ్మెస్, శాలరీ స్లిప్ సరి చూసుకోవాలి
కార్పొరేట్ మోసాలకు చెక్ పెట్టేందుకు 2016లో కంపెనీలు తమ సిబ్బంది నుంచి నిర్వహిస్తున్న టీడీఎస్ వసూళ్ల ఉద్యోగులకు ఎస్ఎమ్ఎస్ల ద్వారా సమాచారం అందేలా ఓ అలర్ట్ సర్వీసును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తమ వేతన ధ్రువీకరణ పత్రం (శాలరీ స్లిప్)లో చూపిన టీడీఎస్ మినహాయింపులతో ఈ ఎస్ఎమ్ఎస్లలోని వివరాలను సరిచూసుకోవాలి. ఈ టీడీఎస్ ఎస్సెమ్మెస్లో తేడాలు ఉంటే వెంటనే సంబంధిత వర్గాల వద్దకు వెళ్లి వాటిని తొలిగించుకోవాలి. దీంతో ఇలాంటి మోసాల బారి నుంచి రక్షణ పొందవచ్చు.