శుభవార్త: ఆరు సర్కిళ్ళలో వీవోఎల్టీఈ సేవలకు ఐడియా శ్రీకారం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహ ఆరు సర్కిళ్ళలోని యూజర్లకు ఐడియా గొప్ప శుభవార్తను అందించింది. మహారాష్ట్ర అండ్ గోవా, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మధ్యప్రదేశ్ అండ్ చత్తీస్గఢ్ సర్కిళ్లలో వీవోఎల్టీఈ (వాయిస్ ఓవర్ ఎల్టీఈ) సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా ఆరు సర్కిళ్ళలో వీవోఎల్టీఈ సేవలను బుధవారం నుండి ప్రారంభించనున్నట్టు ఐడియా ప్రకటించింది. వీవోఎల్టీఈ సేవలను అందిస్తున్న నాలుగో టెలికం కంపెనీగా ఐడియా చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం రిలయన్స్ జియో ఒక్కటే దేశవ్యాప్తంగా వీవోఎల్టీఈ సేవలు అందిస్తుండగా, వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్ కొన్ని సర్కిళ్లలో ఈ సేవలు అందిస్తున్నాయి. తాజాగా వీవోఎల్టీఈ సేవలతో ఐడియా ముందుకు వచ్చింది.
మొదటి వీవోఎల్టీఈ కాల్ చేసిన ఐడియా ఖాతాదారులకు 48 గంటల్లో 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుతం వారు ఉన్న ప్లాన్ చార్జీలే ఈ కాల్కు కూడా వర్తిస్తాయని ఐడియా తెలిపింది. వీవోఎల్టీఈ సాంకేతికతలో ఆపరేటర్లు ఒకే నెట్వర్క్పై వాయిస్ కాల్స్, డేటాను అందించే వీలుంటుంది. అందుకనే టెల్కోలన్నీ ఇటువైపు మొగ్గుచూపుతున్నాయి.