రేపే జైట్లీ బడ్జెట్: ఆస్తి విక్రయాలపై పన్ను హేతుబద్దీకరించాలి.. ఇవీ ఎన్నారైల అభ్యర్థనలు
ముంబై: బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో విత్తమంత్రి అరుణ్ జైట్లీ తన పదవీ కాలంలో ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇదే. దీనికి చాలా ప్రాథమ్యాలు ఉన్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దు తర్వాత మూడేళ్ల దిగువకు పడిపోయిన జీడీపీ ఒకవైపు.. ఈ ఏడాది ఎనిమిది, వచ్చే ఏడాది మూడు అసెంబ్లీ ప్లస్ లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ ప్రజానురంజకంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి విత్త మంత్రి జైట్లీది. ఇందుకు ఆయన ఎన్ని రకాల ఫీట్లు చేసినా కత్తిమీద సామే అంటే అతిశయోక్తి కాదు.
బడ్జెట్ సమర్పణ ముందు వివిధ వర్గాలు ఆయనను కలుసుకుని తమ డిమాండ్లు, ప్రతిపాదనలు, అభ్యర్థనలు, ఆకాంక్షలు వివరించడం సహజంగా జరిగే పరిణామమే. అయితే విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అక్కడే స్థిరపడిన ప్రవాస భారతీయులకు కూడా కొన్ని ఆశలు, ఆకాంక్షలు, అభ్యర్థనలు ఉంటాయి. ఎన్నారైల ఆకాంక్షలు చాలా స్వల్పమైనవి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ తొలగించాలని డిమాండ్లు
ఎన్నారైలు ప్రత్యేకించి సొంతగడ్డపై భూములపైనా, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో భూక్రయ విక్రయాల్లో సంస్కరణలు అమలులోకి తేవాలని కోరుతున్నారు. ఇన్వెస్టర్లో విశ్వాసం పెంచడానికి అడ్డుగోడలా నిలిచింది డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. దీన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి తమ ఉద్యోగాల్లో పదవీ విరమణ చేసిన తర్వాత పెట్టుబడులు పెన్షన్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో తమకు ఇష్టమైన పెన్షన్ ప్లాన్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా పన్నుల నిబంధనలను సరళతరం చేయాలని కోరుతున్నారు. అలాగే నేషనల్ పెన్షన్ స్కీం కింద పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఓర్జిన్ (జీవోపీఐఓ) అధ్యక్షుడు సన్నీ కులాథకల్ అప్పీల్ చేశారు.
పెరిగిన దరలతో ఇల్లు కొనుగోలు మోయలేని భారం
ప్రవాస భారతీయుల్లో అత్యధికులు కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ భారం ఎక్కువగా ఉన్నదని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఆస్తుల లావాదేవీలపై విధిస్తున్న 12 శాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించి వేయాలని కోరుతున్నారు. భూ, ఇతర ఆస్తుల లావాదేవీలపై ఇంతకుముందు వాల్యూయాడెడ్ టాక్స్ కేవలం ఒక్కశాతం, సర్వీస్ టాక్స్ 4.5 శాతం కలుపుకుంటే మొత్తం 5.5 శాతంగా ఉండేది. కానీ జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 12 శాతం పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది మరి. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఓర్జిన్ (జీవోపీఐఓ) అధ్యక్షుడు సన్నీ కులాథకల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటేలా దూసుకెళుతుండటంతో సామాన్యుడు తీసుకునే ఇంటి రుణం వల్ల మోయలేని భారం పడుతున్నదన్నారు. కనుక ఇంటి రుణంపై టాక్స్ డిడక్షన్ మరింత తగ్గించాలని కోరారు. ప్రస్తుతం వివిధ రూపాల్లో రూ.2 లక్షల ఇంటి రుణ వడ్డీపై గల మినహాయింపును రూ.3 లక్షల వరకు పెంచాలని కోరుతున్నారు.
కస్టమ్స్ సుంకం గణనీయంగా తగ్గించాలంటున్న ఎన్నారైలు
ఇక ప్రాథమిక ఎన్నారైలు బ్యాగేజీ అలవెన్స్ మరింత సరళతరం చేయాలని కోరుతున్నారు. ఇక పురుషులైతే 50 గ్రాములు, మహిళలైతే 100 గ్రాముల బంగారం వెంట తెచ్చుకునేందుకు నిబంధనలను సరళతరం చేయాలని కోరుతున్నారు. స్థూలంగా పసిడి క్రయ, విక్రయాలపై పన్ను హేతుబద్దీకరించడంతోపాటు 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని కోరుతున్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ తమ బడ్జెట్ ప్రజాకర్షకంగా ఉండదని పేర్కొన్నా వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉంటాయని చెబుతున్నాయి. సగటు భారతీయుడికి స్వల్ప ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటాని అంటున్నారు. ద్రవ్య సంస్కరణలు అమలులోకి తెచ్చిన తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపులపై మినహాయింపు లభిస్తుందని అది రూ.3 లక్షల వరకు.. వయో వ్రుద్ధులకు రూ.3.5 లక్షల వరకు మినహాయింపు ఇస్తారని ఆశిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం వైద్య ఖర్చుల మినహాయింపు పరిమితి రూ.15 వేలుగా నిర్ణయించగా, దాన్ని రూ.30 వేలకు పెంచుతారని అంచనాలు ఉన్నాయి.