భారత్ వృద్ధి తీరు బాగే.. కానీ 8శాతం సాధించాలంటే 30 ఏళ్లు: ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు బాగుందని ప్రపంచబ్యాంక్ అంచనావేసింది. ఎనిమిది శాతానికి పైగా వ్రుద్ధి రేటు నమోదు కావాలంటే మూడు దశాబ్దాలు పడుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది. మధ్య తరగతి ఆదాయ దేశాల పరిధిలో భారీ సంస్కరణలు తేవాల్సి ఉన్నదని వ్యాఖ్యానించింది. ఆర్థిక, కార్మిక, భూ రంగాల్లో భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. దేశ జనాభాలో 50 శాతం మంది రోజువారీ రూ.648తో జీవనం సాగిస్తున్నారని వ్యాఖ్యానించింది.
భారతదేశంలో వ్యక్తిగత ఆదాయం ఏడాదికి రూ.86,689గా ఉన్నదని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ జునాయిద్ అహ్మద్ తెలిపారు. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో 2004 నుంచి 2008 వరకు 8.8 శాతం వ్రుద్ధి రేటు నమోదైతే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతానికి పరిమితమైందన్నారు.
బాహ్య ప్రపంచంలోకి నెలా పది లక్షల నిరుద్యోగులు
వచ్చే ఐదేళ్లలో భారతదేశానికి 20 నుంచి 25 బిలియన్ల డాలర్ల వరకు రుణాలు మంజూరు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ జునాయిద్ అహ్మద్ అన్నారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పన, మానవ వనరులు, సహజ వనరుల యాజమాన్యంపై ప్రధానంగా పెట్టుబడి పెట్టాలన్నది లక్ష్యమని ఇది సమగ్ర ఆర్థిక ప్రగతికి మార్గం సుగమం చేస్తుందన్నారు. భారతదేశం దీర్ఘకాలిక వ్రుద్ధి స్థిరంగా, వేగంగా అభివ్రుద్ధి సాధిస్తుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదోస్థానంలో నిలిచిన భారతదేశంలో ఏటా ఉద్యోగాల కల్పన పెంపొందించాలని అన్నారు. ప్రతి నెలా పది లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారని తెలిపారు.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అనుసంధానించాలన్న ప్రపంచ బ్యాంకు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్ - 2018 మార్చి) భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేశామని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ జునాయిద్ అహ్మద్ చెప్పారు.. 2019-20లో ఈ రేటు 7.5 శాతం. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7 శాతంగా నమోదయ్యే వీలు ఉన్నదని తెలిపారు. ‘భారత్ ఎనిమిది శాతం వృద్ధి నమోదు చేయడానికి మరిన్ని చర్యలు అవసరం. సంస్కరణల కొనసాగింపు, వాటి విస్తృతి ఇక్కడ కీలకం. అలాగే రుణం, పెట్టుబడుల సంబంధ సమస్యలు పరిష్కారం కావాలి. భారత్ ఆర్థిక వ్యవస్థ మొత్తం క్రమంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కావాల్సి ఉంటుంది' అని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాల నుంచి భారత్ రికవరీ అవుతుంది. దీనితో వృద్ధి తీరు కూడా నెమ్మదిగా రికవరీ అవుతుంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది.
కూరగాయలతోపాటు ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గాయ్!!
రిటైల్ ద్రవ్యోల్బణంతోపాటు ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ ఊరట ఇచ్చింది. గత ఫిబ్రవరి నెలలో టోకు ధరల సూచి 2.48 శాతంగా నమోదైంది. 2017 ఫిబ్రవరితో పోల్చితే 2018 ఫిబ్రవరిలో టోకు వస్తువుల విభాగం ధర 2.48 శాతానికి తగ్గగా, 2017లో టోకు ద్రవ్యోల్బణం 5.51 శాతం నమోదైంది. ఏడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. కూరగాయలతోపాటు ఆహార ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరిలో తగ్గడం సానుకూలం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.44 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
ఇంధన, విద్యుత్ రంగంలో భారీగా తగ్గుదల నమోదు
ప్రాథమిక ఆహార వస్తువులు, ఆహారేతర వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.01 శాతం నుంచి 0.79 శాతానికి తగ్గింది. ఆహార వస్తువుల ధరలు 2.55 శాతం నుంచి 0.88 శాతానికి తగ్గింది. జనవరిలో ఈ రేటు 3 శాతంగా ఉంది. ఒక్క కూరగాయలు ధరలు చూస్తే, జనవరిలో ధరల పెరుగుదల రేటు 40.77 శాతం ఉంటే, ఫిబ్రవరిలో ఈ రేటు 15.26 శాతానికి పడింది. పప్పు దినుసుల ధరలు పెరక్కపోగా 24.51 శాతం తగ్గాయి. ఇక ఆహారేత వస్తువుల ధరలు అసలు పెరుగలేదు. గత ఫిబ్రవరిలో -2.66 శాతం తగ్గింది. ఇది గతేడాది ఫిబ్రవరిలో ఈ రేటు 4.65 శాతంగా నమోదైంది. ఇంధనం, విద్యుత్ రంగాల్లో ద్రవ్యోల్బణం రేటు 25.17 శాతం నుంచి 3.81 శాతానికి తగ్గింది. తయారీ రంగంలో ద్రవ్యోల్బణం రేటు 3.23 శాతం నుంచి 3.04 శాతానికి తగ్గింది.