ఒక్క రోజే 25 పైసలు లాభం! తిరగబడిన రూపాయి
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో మంగళవారం మన రూపాయి బాగా లాభపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 25 పైసలు పుంజుకుని, మార్కెట్ ముగిసే సమయానికి 95.36 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడవడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం వంటి అంశాలు రూపాయి బలపడటానికి కారణమయ్యాయని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు. రూపాయి పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం కూడా కలిసివచ్చింది.
మంగళవారం ఉదయం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు రూపాయి 95.47 వద్ద ట్రేడింగ్ను స్టార్ట్ చేసింది. రోజంతా జరిగిన లావాదేవీల్లో ఒక దశలో 95.23 గరిష్ట స్థాయిని, మరో సందర్భంలో 95.67 కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 25 పైసల లాభాన్ని మూటగట్టుకుని 95.36 వద్ద సెషన్ను ముగించింది. అంతకుముందు రోజు (సోమవారం) రూపాయి ఏకంగా 43 పైసలు నష్టపోయి 95.61 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి నష్టాల నుంచి రూపాయి మంగళవారం బాగా కోలుకుంది.

రాబోయే రోజుల్లో రూపాయి ఎలా ఉండబోతోంది?
ఈ మార్కెట్ కదలికలపై మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి విశ్లేషణను ప్రకారం... "పశ్చిమాసియా యుద్ధ వాతావరణంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాబట్టి రూపాయి రాబోయే రోజుల్లో కొంత ఒత్తిడిలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి రూపాయిపై ప్రభావం పడుతుంది.
ప్రస్తుతానికి ఉన్న శాంతి వాతావరణం ఇలాగే కొనసాగితే రూపాయి ఇంకా కోలుకుంటుంది. రాబోయే రోజుల్లో అమెరికా నుంచి రానున్న నిరుద్యోగిత డేటా, వాణిజ్య గణాంకాలు, గృహ విక్రయాల రిపోర్టులను ట్రేడర్లు గమనించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో రూపాయి విలువ 95.10 నుంచి 95.80 మధ్య కదలాడవచ్చు" అని ఆయన అంచనా వేశారు.
మార్కెట్లో మిగతా అప్డేట్స్..
మరోవైపు ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చి చూసే 'డాలర్ ఇండెక్స్' 0.24 శాతం తగ్గి 99.80 వద్దకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.04 శాతం క్షీణించి బ్యారెల్ 92.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే.. మంగళవారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 394.50 పాయింట్లు పెరిగి 73,918.76 వద్ద, నిఫ్టీ 119.10 పాయింట్లు పెరిగి 23,242.10 వద్ద స్థిరపడ్డాయి. కాగా, సోమవారం నాడు విదేశీ పెట్టుబడిదారులు (FIIs) నికరంగా రూ. 5,555.67 కోట్ల విలువైన షేర్లను మార్కెట్లో విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ డేటా ద్వారా తెలిసింది.














Click it and Unblock the Notifications