ఇన్ఫోసిస్కు ఎదురుదెబ్బ: బన్సాల్కు రూ.12.7కోట్లు చెల్లించాల్సిందే, అసలు ఆ వివాదమేంటి?
బెంగళూరు: దేశీయ టెక్కీ దిగ్గజం ఇన్ఫోసిస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్కు వడ్డీతో సహా రూ.12.17కోట్లను చెల్లించాల్సిందేనని ఇన్ఫోసిస్ను ఆర్బిట్రేషన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది.
రూ.17 చెల్లించాలంటూ..
తనకు చెల్లించాల్సిన రూ.17కోట్ల సెవరెన్స్ ప్యాకేజీ విషయంలో రాజీవ్ బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యూనల్ను ఇటీవలే ఆశ్రయించారు. బన్సాల్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా కంపెనీ కౌంటర్ ఫిర్యాదును కూడా దాఖలు చేసింది.
ఇన్ఫీ ఫిర్యాదును కొట్టేసిన ఆర్బిట్రేషన్
అంతకుముందు చెల్లించిన రూ.5.2కోట్లను, ఇతర డ్యామేజీలను కంపెనీకి తిరిగి చెల్లించాలంటూ బన్సాల్ ను ఆదేశించాలని ఇన్ఫోసిస్ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ ఫిర్యాదును ఆర్బిట్రేషన్ ట్రిబ్యూనల్ కొట్టివేసింది. ఈ విషయంపై తదుపురి చర్యల కోసం న్యాయసూచనలు తీసుకుంటామని కంపెనీ బొంబై స్టాక్ ఎక్ఛేంజ్కు తెలిపింది.
బన్సాల్ ప్యాకేజీ వివాదమే రాజేసింది..
కాగా, రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజీ విషయంలో ఇన్ఫోసిస్లో పెద్ద వివాదమే రాజుకుంది. కంపెనీ గవర్నెన్స్లు దెబ్బతిన్నాయంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, కంపెనీ బోర్డుకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. సెవరెన్స్ ప్యాకేజీ కింద రాజీవ్కు పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారంటూ ఆరోపించారు.
12.17కోట్లు చెల్లించాల్సిందేనంటూ..
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా 2015లో రాజీవ్ బన్సాల్ కంపెనీకి రాజీనామా చేశారు. అప్పుడు రూ.17.38కోట్ల సెవరెన్స్ ప్యాకేజీ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దానిలో కేవలం రూ.5కోట్లు మాత్రమే రాజీవ్కు చెల్లించింది. దీంతో, మిగితా మొత్తాన్ని కూడా తనకు చెల్లించాలని కోరుతూ.. బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యూనల్ను ఆశ్రయించడంతో రూ.12.17కోట్లను చెల్లించాల్సిందేనని ఇన్ఫీకి ఆదేశాలు జారీ చేసింది.