వార్షిక ఫలితాల దెబ్బ: ఇన్ఫోసిస్ షేర్లు డమాల్, నిమిషాల్లో 15వేల కోట్ల సంపద ఆవిరి
ముంబై: ఇన్ఫోసిస్ షేర్లు పడిపోయాయి. ఈ సంస్థ శుక్రవారం తమ వార్షిక ఫలితాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమవారం షేర్లు పడిపోయాయి. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభం, ఆదాయంలో అంచనాలను అందుకుంది.
కానీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వెల్లడించిన మార్జిన్ రేంజ్ అంచనాల కంటే తక్కువగా ఉంది. ఈ ప్రభావం ఇన్ఫోసిస్ షేర్ల పైన పడింది. సోమవారం నాటి ట్రేడింగ్లో ఈ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇంట్రాడేలో దాదాపు ఆరు శాతం నష్టోయాయి. దీంతో నిమిషాల్లో ఇన్ఫోసిస్ మార్కెట్ విలువలో రూ. 15వేల కోట్ల సంపద ఆవిరి అయింది. ఆ తర్వాత కాస్త తేరుకుంది.
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీఎస్ఈలో షేరు విలువ 3.21శాతం నష్టంతో రూ. 1,130.70 వద్ద, ఎన్ఎస్ఈలో 3.49శాతం నష్టంతో రూ. 1,130.60 వద్ద కొనసాగింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఇన్ఫోసిస్ మార్జిన్ రేంజ్ను 22 నుంచి 24 శాతంగా అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇది 23 నుంచి 25శాతం ఉంది. ఈ అంచనాలు కంపెనీ షేర్లపై ప్రభావం చూపాయి.