ఎడ్డెమంటే తెడ్డెం: డిజిటల్ చెల్లింపులకు సర్కార్ సహకారం.. భిన్నంగా బ్యాంకుల జరిమానాలు
ముంబై: నల్లధనం అరికట్టడంతోపాటు డిజిటల్ లావాదేవీల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు అందుకు భిన్నమైన మార్గంలో పయనిస్తున్నాయి. బ్యాంకులు తమ ఖాతాదారులను మరింత బెంబేలెత్తించేలా జరిమానాలు విధిస్తున్నాయి.బ్యాంక్ ఖాతాలో సరిపడా నిల్వ లేకుండా, పొరపాటున పాయింట్ ఆఫ్ సేల్ (పాస్) యంత్రం వద్ద చెల్లింపునకు డెబిట్ కార్డు స్వైప్ చేసినా, లావాదేవీ కనుక తిరస్కరించినట్లు (డిక్లైన్డ్) సందేశం వచ్చినా బ్యాంకులు రూ.17-25 వరకు జరిమానా విధిస్తున్నాయి.
బ్యాంకుల ఆదాయం భరించేందుకు రెండేళ్లు కేంద్రం రెడీ
పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాల్లోనే కాదు.. ఇంటి పక్కన ఉండే కిరాణా దుకాణాల్లోనూ, డెబిట్ కార్డు, భీమ్ యాప్, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రూ.2,000 వరకు వినియోగదారులు జరిపే చెల్లింపులకు సంబంధించి, ఆయా వ్యవస్థల నిర్వహణకు వ్యాపారి నుంచి వసూలు చేసే ఛార్జీ (ఎండీఆర్)ను రెండేళ్ల పాటు రద్దు చేస్తూ, ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇందువల్ల బ్యాంకులకు ఆదాయం తగ్గుతుంది కనుక, తాము రెండేళ్ల పాటు పరిహారం ఇస్తామని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకులకు తెలిపింది.
2016 - 17లో రూ. 3.3 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు
దుకాణం, హోటల్.. ఎక్కడైనా పీఓఎస్ ద్వారా రూ.2,000 వరకు చెల్లింపులు జరిపేందుకు కార్డును వినియోగదారులు వినియోగించినా, వ్యాపారులకు అదనపు భారం పడదు. ఇందువల్ల చిల్లర దుకాణాలు, బడ్డీకొట్లలోనూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా మారుతుందన్నది ప్రభుత్వ యోచన. ఇది నిజం కూడా. పెద్దనోట్ల రద్దు తరవాత డెబిట్కార్డ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. 2014-15లో 80 కోట్ల లావాదేవీల్లో రూ.1.2 లక్షల కోట్ల చెల్లింపులు జరగ్గా, 2016-17లో 240 కోట్ల లావాదేవీల ద్వారా రూ.3.3 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. లావాదేవీల సంఖ్యతో పాటు, చెల్లింపు మొత్తం కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేసినందున, బ్యాంకులకు పరిహారంగా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 2018-19లో రూ.1050 కోట్లు, 2019-20లో రూ.1462 కోట్లకు చేరుతుందని అంచనా.
ఏ సందేశం వచ్చినా ఖాతాదారులపై రుసుముల వడ్డింపే
బ్యాంక్ ఖాతాలో సరిపడా నగదు లేకుండా చెక్ జారీ చేసినపుడు, తిరస్కరణకు గురవుతుంటాయి. ఈ సమయంలో బ్యాంకులు రూ.వందల్లో జరిమానాలు విధిస్తున్నాయి. అదే తరహాలో ఖాతాలో సరిపడా నగదు లేకుండా డెబిట్కార్డును ఉపయోగించి ఏటీఎంలో నగదు తీసేందుకు ప్రయత్నించినా, పీఓఎస్లో చెల్లింపు చేయాలనుకున్నా, లావాదేవీ తిరస్కరించినట్లు సందేశం వస్తుంది. ఇలా జరిగితే జరిమానాలు విధిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నిసార్లు ఇలా జరిగితే, అన్నిసార్లు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఖాతాలో నగదు పడ్డపుడు, ఈ మొత్తాన్ని బ్యాంక్ మినహాయించుకుంటుంది. తిరస్కరణకు గురైన ప్రతి లావాదేవీకి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.17, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.25 చొప్పున విధిస్తున్నాయి. దీనికి జీఎస్టీ అదనం. ఈ విషయాన్ని ఎస్బీఐ డీజీఎం ఒకరు ధ్రువీకరించారు.
ఇక డెబిట్ కార్డు స్వైప్ చేయాలంటే ఆలోచించాల్సిందే
నెల మొత్తంమీద ఖాతా నిర్వహిస్తున్న బ్యాంక్ ఏటీఎంలు, ఇతర ఏటీఎంలలో కలిపి 8 ఉచిత లావాదేవీలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడంతో పాటు ఖాతాలో నగదు ఎంత ఉందో పరిశీలించుకున్నా, ఒక లావాదేవీ పూర్తయినట్లుగా బ్యాంకులు పరిగణిస్తున్నాయి. ఇందువల్లే ఖాతాలో నగదు ఎంత ఉందో ప్రత్యేకంగా ఖాతాదారులు పరిశీలించడం లేదు. ఏటీఎంకు వెళ్లి కార్డుతో నగదు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగదు ఉంటే వస్తుంది, లేకపోతే, సరిపడా నిల్వ లేదని సందేశం వస్తోంది. ఇకపై ఇలా చేసేందుకూ వెనకాడాల్సిందే. లేకపోతే తగిన నిల్వ లేకుండా నగదు తీసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ జరిమానా పడుతుంది. నెలవారీ తక్కువ ఆదాయం పొందేవారు, ఇందువల్ల తీవ్రంగా ఇబ్బంది పడతారు. డిజిటల్/కార్డ్ లావాదేవీలు ఎందుకులే.. ఖాతాలో ఉన్న నగదు అంతా ఒకేసారి తీసుకుని, నగదుతో లావాదేవీలకు ప్రయత్నించవచ్చు. ఇది నగదు రహిత లావాదేవీల లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది.
ఎస్సెమ్మెస్ ఆధారంగా నగదు విత్ డ్రాయల్స్ చేస్తే సరి
ఖాతాదారులు బ్యాంకుకు ఇచ్చిన మొబైల్ నెంబర్ను, కార్డుతో ఆర్థిక లావాదేవీలు జరిపేప్పుడు తప్పనిసరిగా చెంత ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పాస్ వద్ద కొనుగోలు చేసినా, ఏటీఎంలో నగదు ఉపసంహరించినా, మొబైల్కు సంక్షిప్త సందేశం వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతి లావాదేవీలో ఎంత మొత్తం వెచ్చించిందీ, ఇంకా ఖాతాలో ఎంత నిల్వ ఉందో ఈ సందేశంలో తెలుపుతోంది. ఈ సందేశాలు చూసుకుని, తదుపరి చెల్లింపులు, నగదు ఉపసంహరణకు ప్రయత్నించవచ్చు.
ఎస్సెమ్మెస్తో లావాదేవీల నిర్వహణకు తేలిక ఇలా
ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ను కూడా జతచేసుకున్నాక, 50 కోట్ల మంది ఖాతాదారులు, రూ.41 లక్షల కోట్ల ఆస్తులతో ప్రపంచంలోనే 45వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన ఎస్బీఐ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. తమ ఖాతాదారు నగదును వేరే ఖాతాలకు బదిలీ చేసినపుడు , ఇంకా ఎంత నిల్వ ఉందో తెలుపుతూ మొబైల్కు సందేశం (ఎస్ఎంఎస్) పంపుతోంది. పాస్ వద్ద కార్డ్ స్వైప్ చేసినపుడు, ఎంత చెల్లించామో చూపుతోంది కానీ, ఖాతాలో నగదు ఎంత నిల్వ ఉందో ఆ ఎస్ఎంఎస్లో ఉండటం లేదు. ఇది కూడా ఉంటే ఖాతాదారులకు తమ ఖాతాలో ఇంకా ఎంత మిగులు ఉందో తెలుసుకుని, అందుకనుగుణంగా ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తారు.
చెక్ల కోసం ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అప్లయి చేసుకోవచ్చు
ఎస్బీఐలో విలీనమైన స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), స్టేట్బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపుర్, స్టేట్బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్బ్యాంక్ ఆఫ్ రాయపూర్తోపాటు భారతీయ మహిళా బ్యాంక్ ఖాతాదారులు తమ చెక్బుక్లను పరిశీలించుకోవాలి. విలీనమైన బ్యాంకుల చెక్లు ఇప్పటివరకు చెల్లుతూ వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి అవి చెల్లవని ఎస్బీఐ స్పష్టం చేసింది. అందువల్ల వీరు తమ ఎస్బీఐ శాఖకు లేదా ఏటీఎం కేంద్రానికి వెళ్లి, ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.