చందా కొచ్చార్ భర్తకు రెండోసారి ఐటీ డిపార్టుమెంట్ నోటీసులు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్కు ఐటీ అధికారులు రెండోసారి నోటీసులు పంపించారు. వీడియోకాన్ లోన్ ఇష్యూలో పన్ను ఎగవేతకు సంబంధించి దర్యాఫ్తులో భాగంగా సోమవారం నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఈ వ్యవహారంలో దీపక్కు చెందిన సంస్థకు ఏప్రిల్ మొదటి వారంలో నోటీసులు జారీ అయ్యాయి. గత కొన్నేళ్లకు సంబంధించి వ్యక్తిగత ఆదాయాలు, ఆదాయపు పన్ను రిటర్న్లు, ఆయన కంపెనీ న్యూపవర్ రెన్యూవబుల్స్కు చెందిన వ్యాపార లావాదేవీల వివరాలను సమర్పించాలని పేర్కొంది. దీనిపై ఆయన స్పందించలేదు. దీంతో మళ్లీ నోటీసులు ఇచ్చింది.
కాగా, ఆరేళ్ల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ తీసుకున్న రుణం వ్యవహారంలో వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్, దీపక్లపై ఆరోపణలు వచ్చాయి. సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
దీంతో పాటు 2012లో వీడియోకాన్ గ్రూప్కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణం వ్యవహారంలో క్విడ్ ప్రోకో ప్రాతిపదికన లబ్ధి చేకూర్చారా అనే విషయాన్ని తేల్చేందుకు బ్యాంకుకు చెందిన కొందరు అధికారులను సీబీఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణ కోసం వీడియోకాన్ గ్రూపు ప్రమోటర్ వేణు గోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్, మరికొందరి పేర్లను చేర్చింది.