కుప్పకూలిన మార్కెట్లు, 5 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి: కారణాలివే
ముంబై: మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్తో రూపాయి విలువ కారణంగా మార్కెట్ భారీగా పడిపోయింది. వరుస నష్టాల నుంచి బుధవారం కాస్త కోలుకున్నప్పటికీ ఈ రోజు దలాల్ స్ట్రీట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది.
ముఖేష్ అంబానీ దినసరి సంపాదన రూ.187.9 కోట్లు, కరిగిపోతున్న అనిల్ అంబానీ ఆస్తి
ప్రీ ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా రూపాయి గురువారం మరింత పతనమైంది. డాలరుతో రూపాయి విలువ మారకం 24 పైసలు క్షీణించి రూ.74.45 వద్ద ఉంది. ఇది లైఫ్ టైమ్ హయ్యెస్ట్.
ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్లు నష్టపోవడం కూడా మన మార్కెట్ల పైన బాగా ప్రభావం చూపింది. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 959 పాయింట్లు నష్టపోయి 33,801.82 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 296.55 పాయింట్లు నష్టపోయి 10,163.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. గురువారం కేవలం ఐదు నిమిషాల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
గత ఎనిమిది నెలల్లో ఇది అతిపెద్ద కుదుపుగా చెబుతున్నారు. మార్కెట్లు ఆ తర్వాత కొంత రికవరీ అయినప్పటికీ ఆశించినంతగా లేదు. ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, గెయిల్ తదితర కంపెనీ షేర్లు లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, వొడాఫోన్, ఐడియా, యాక్సెస్ బ్యాంక్ తదితర షేర్లు నష్టపోయాయి.