నీరవ్ మోదీకి రాకకు భద్రత సమస్య?: రూ.50 కోట్ల రుణానికి పాస్పోర్టు తప్పనిసరి
ముంబై: నీరవ్ మోదీ భారత్కు రావడంలో తీవ్రజాప్యం తప్పదని తేలిపోయింది. గురువారం సీబీఐ పంపిన సమన్లకు నీరవ్ అలా జవాబిచ్చారని ఆయన న్యాయవాది తెలిపారు. తాను భారత్ వచ్చేందుకు మరింత జాప్యం జరగవచ్చని, భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయని నీరవ్ మోదీ పేర్కొన్నారని ఆయన లాయర్ విజయ్ అగర్వాల్ తెలిపారు. తాను దీనిని కుంభకోణంగా భావించడంలేదని అగర్వాల్ పేర్కొన్నారు. నీరవ్ విదేశాల్లో చాలా వ్యాపారాలతో బిజీగా ఉన్నట్లు అగర్వాల్ తెలిపారు.
ఇప్పటికే నీరవ్కు చెందిన రూ.523 కోట్లు విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. దీనికి తోడు విదేశాంగశాఖ నోటీసులకు స్పందించకపోవడంతో నీరవ్, మెహుల్ చౌక్సీల పాస్పోర్టులను రద్దు చేశారు. కానీ ఇప్పటి వరకు వీరిద్దరు ఎక్కడ ఉన్నారో ఆచూకీలేదు. మరోపక్క లోతుగా దర్యాప్తు జరిగే కొద్దీ పీఎన్బీ కుంభకోణంలో నష్టపోయిన సొమ్ము మరింత పెరగనుందని సమాచారం. ఇప్పటికే ఇది రూ.12,700 కోట్లను దాటినట్లు తేలింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.
పీఎన్బీలో 158 కేసుల్లో రూ.2,800 కోట్లు హాంఫట్
గత ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో 158 మోసాల కేసులు జరిగినట్లు తెలుస్తోంది. దీనివల్ల బ్యాంకుకు రూ.2,800 కోట్లు (431 మిలియన్ల డాలర్లు) నష్టం వాటిల్లిందని సమాచారం. ఇప్పటికే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వజ్రాల వ్యాపారులతో పీఎన్బీకి రూ.12,700 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలోని వివిధ బ్యాంకుల్లో 2,718 మోసాల కేసుల్లో రూ.19,533 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. తాజాగా రూ.2800 కోట్ల మోసం పీఎన్బీ ఇంకా స్పందించలేదు. పీఎన్బీతోపాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.2,770 కోట్లు, ఎస్బీఐలో రూ.2,420 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. అయితే దీన్ని ఆర్థిక నిర్ధారించకున్నా ఆర్బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారిస్తోంది. అంతర్జాతీయ వార్తాసంస్థ ‘రాయిటర్స్' కథనం ప్రకారం 8,670 మోసాల కేసుల్లో భారతదేశ బ్యాంకుల్లో గత ఐదేళ్లలో రూ.61,260 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది.
పెద్దమొత్తాల్లో రుణాలు పొందేవారు పాస్పోర్టు వివరాలివ్వాలి
నీరవ్ మోదీ లాంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారి నుంచి పాస్పోర్ట్ వివరాలు కచ్చితంగా స్వీకరించాలని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించింది. భారీ మొత్తంలో రుణం తీసుకుని, వాటిని ఎగొట్టి దేశం విడిచి పారిపోయేందుకు వీలు లేకుండా.. నిరోధించేందుకు పాస్పోర్టు వివరాలను సేకరిస్తున్నట్టు టాప్ అధికారి ఒకరు చెప్పారు. పాస్పోర్ట్ వివరాలతో సరైన సమయంలో బ్యాంకులు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని, దేశం విడిచి పారిపోకుండా సంబంధిత అథారిటీలకు వారి గురించి వెంటనే సమాచారం అందించడం కుదురుతుందని పేర్కొన్నారు.
45 రోజుల్లోగా రుణగ్రహీతల పాస్ పోర్టు వివరాలు సేకరించాలి
‘స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ను అందించడమే తర్వాతి చర్య. రూ.50 కోట్లకు పైబడి రుణం తీసుకునే వారి పాస్పోర్ట్ వివరాలు తప్పనిసరిగా సేకరించాలి. మోసం జరిగిన సమయంలో వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది'' అని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్పోర్ట్ వివరాలను బ్యాంకులు 45 రోజుల్లోగా సేకరించాలని కూడా ఆదేశాలు జారీచేశారు.
దర్యాప్తు సంస్థలకూ సహకరించని ఘనాపాటీలు
నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి, విజయ్ మాల్యా, జతిన్ మెహతా వంటి పలువురు డిఫాల్టర్లు, బ్యాంకులను భారీ మొత్తంలో మోసం చేసి, దర్యాప్తు ఏజెన్సీలకు చిక్కకుండా విదేశాలకు పారిపోయారు. పీఎన్బీలో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల విచారణకు కూడా సహకరించడం లేదు. ఈ క్రమంలో రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్పోర్ట్ వివరాలను బ్యాంకులు సేకరించాలని ఆర్థికమంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది.
ఎస్బీఐలో రూ.4.12 కోట్లకు మోసం
కోల్కత్తా : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణం తర్వాత బ్యాంకుల్లో మోసాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద దిగ్గజమైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో రూ.4.12 కోట్ల మోసం జరిగినట్టు వెల్లడైంది. దీని విషయమై ఎస్బీఐ అధికారులపై, ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన డైరెక్టర్లపై సీబీఐ కొరడా ఝుళిపించింది.
రూ.4.45 కోట్ల మేరకు ఇలా నిబంధనలు ఉల్లంఘించి రుణాలు
రుణ మోసానికి పాల్పడిన ఎనిమిది ఎస్బీఐ అధికారులపై, ప్రైవేట్ సంస్థకు చెందిన ఐదుగురు డైరెక్టర్లపై కేసు నమోదుచేసినట్టు సీబీఐ పేర్కొంది. ఎస్బీఐ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది. కంపెనీకి చెందిన డైరెక్టర్లు పశ్చిమబెంగాల్లోని రెండు ఎస్బీఐ శాఖల అధికారులతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ కోసం ఈ ప్రైవేట్ సంస్థ రూ.4.45 కోట్ల రుణం తీసుకుంది. ఈ లావాదేవీలు 2009 నుంచి 2014 మధ్య జరిగాయి. కానీ రుణ గ్రహీత నియమ, నిబంధనలను ఉల్లంఘించారు.
ఎస్బీఐ, ఫ్రైవేట్ సంస్థ అధికారులపై సీబీఐ ఇలా కేసుల నమోదు
దీంతో 2014 నవంబర్లో ఈ అకౌంట్ స్థూల మొండి బకాయిగా మారిపోయిందని.. ఈ మోసంతో బ్యాంకుకు రూ.4.12 కోట్ల నష్టం ఏర్పడినట్టు సీబీఐ వెల్లడించింది. ఈ నష్టాల్లో వడ్డీ చెల్లింపులను ఇంకా కలుపలేదు. ఈ మోసం విషయమై ఎస్బీఐ అధికారులు, ప్రైవేట్ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదుచేసింది. అంతేకాక వారి నివాసాలపై సీబీఐ దాడులు కూడా నిర్వహించింది. కోల్కతా, డార్జిలింగ్, హజీపూర్ (బీహార్), పెల్లింగ్ (సిక్కిం), కుచ్ బీహర్ (పశ్చిమ బెంగాల్) తదితర 12 ప్రాంతాల్లో దాడులు జరిపింది.