బానిసత్వం నుంచి సంపన్న దేశాల సరసన ‘భారత్’ ఇలా
న్యూఢిల్లీ: సరిగ్గా 71 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశం.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సంపన్న దేశాలకు దీటుగా నిలబడిందంటే ప్రణాళికాబద్ధమైన బడ్జెట్లతోనే సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. 1947లో కేవలం ఏడున్నర నెలల కాలానికి సుమారు రూ.375 కోట్ల నిడివి గల బడ్జెట్ సమర్పిస్తే.. 1951 బడ్జెట్.. ప్రణాళికా సంఘం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. కాకపోతే ప్రస్తుతం ఆర్థిక సంస్కరణల అమలు నేపథ్యంలో ప్రణాళిక సంఘానికి బదులు నీతి ఆయోగ్ ఉనికిలోకి వచ్చింది. అది వేరే సంగతి. 1968లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయి దేశ ప్రజలు కేంద్రంగా బడ్జెట్ రూపొందిస్తే, పాకిస్థాన్తో యుద్ధం ముగిసిన తర్వాత 1973లో బొగ్గు గనులు, సాధారణ బీమా సంస్థలు, భారత రాగి సంస్థ జాతీయకరణతో బ్లాక్ బడ్జెట్గా పేరుబడింది.
భారీగా లాభాలు గడిస్తున్నా నిబంధనల మాటున పన్ను ఎగవేతకు పాల్పడిన పారిశ్రామిక వేత్తలకు రాజీవ్ గాంధీ 1987లో ముకుతాడు వేశారు. 2000లో మిలీనియం బడ్జెట్ సమర్పించిన బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా.. భారత ఐటీ పరిశ్రమ అనూహ్య ప్రగతి సాధించింది. అంతకుముందు 1991లో ప్రస్తుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొలి సంస్కరణల బడ్జెట్ ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ సారథ్యంలో 1986లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే 'జీఎస్టీ' వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
తొలి బడ్జెట్ ఆయువు కేవలం ఏడున్నర నెలలే
బ్రిటిష్ వలస పాలన నుంచి 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత దేశ ఆర్థిక మంత్రిగా ఆర్ కే శణ్ముఖం శెట్టి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే అది కేవలం ఏడున్నర నెలల కాలానికి మాత్రమే పరిమితమైన చిన్న బడ్జెట్. 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు మాత్రమే ఈ బడ్జెట్ వినియోగం. అయితే నాడు బడ్జెట్ పూర్తి రెవెన్యూ ఆదాయం అంచనాలు రూ.171.15 కోట్లయితే ద్రవ్యలోటు.. ఆదాయాన్ని మించి రూ. 204.59 కోట్ల వద్దకు చేరుకున్నది. అంటే రూ.171.15 కోట్ల ఆదాయం పోగా నాటి దేశీయ అవసరాల కోసం చేసిన అదనపు ఖర్చు అన్నమాట.
తొలి ప్రధాని నెహ్రూ సారథ్యంలో ప్రణాళికా సంఘం ఏర్పాటు
1950 జనవరి 26వ తేదీన గణతంత్ర భారతంగా మారిన తర్వాత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి జాన్ మాథాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ ప్రణాళికా సంఘం స్రుష్టించడానికి కార్యాచరణ రూపొందించారు. తర్వాతీ కాలంలో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలోనే దేశంలోని అన్ని రకరాల వనరులను వెలికితీసి, వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందాయి. గమ్మత్తేమిటంటే తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూయే తొలి ప్రణాళికా సంఘం చైర్మన్ గానూ వ్యవహరించారు.
వస్తువుల తయారీపై పరిశ్రమలకు స్వచ్ఛంద నిర్ధారణ హక్కు ఇలా
కాంగ్రెస్ పార్టీ నేత మొరార్జీ దేశాయి 1968లో తొలిసారి ప్రజలు కేంద్రంగా బడ్జెట్ రూపొందించారు. నాటి నుంచి అత్యధికంగా పది బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా పేరొందిన మొరార్జీ దేశాయి పలు సంచలన నిర్ణయాలు అమలులోకి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీ గేట్ల వద్ద వస్తువులను లెక్క గట్టేందుకు ఎక్సైజ్ అధికారుల నియామకం అవసరం లేదని, చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలే స్వీయ నిర్ధారణ గణాంకాలు ఆర్థికశాఖకు సమర్పించాలన్న విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇదే బడ్జెట్లో మరో సంచలన నిర్ణయం అమలు చేశారు. భార్యాభర్తలు ఆదాయం పన్ను చెల్లింపుదారులైతే జీవిత భాగస్వామికి అలవెన్స్ చెల్లించాలన్న నిబంధనను ఆయన ఉపసంహరిస్తున్న నాటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. భార్యాభర్తల్లో ఎవరు ఎవరిపై ఆధారపడి ఉన్నారన్న విషయమై బయటి వ్యక్తులు జోక్యం చేసుకోవడం సరి కాదని తేల్చారు. వివాహ బంధానికి నిర్వచించే అనాలోచిత ప్రయాసను తొలగించడానికి ప్రయత్నించారు. కాకపోతే మన సమాజంలో భార్యాభర్తలు విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఉన్నది.
బొగ్గు, బీమా సంస్థలు ఇలా జాతీయకరణ
మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి యశ్వంతరావు బల్వంతరావు చవాన్ 1973 ఫిబ్రవరి 28వ తేదీన ప్రవేశ పెట్టిన బడ్జెట్కు ‘బ్లాక్ బడ్జెట్' అని పేరు వచ్చింది. ఈ బడ్జెట్లో ద్రవ్యలోటు అత్యధికంగా రూ.550 కోట్లుగా ఉంది. ఇందులో సాధారణ బీమా సంస్థలు, భారత రాగి సంస్థ, బొగ్గు గనుల జాతీయకరణ ద్వారా వచ్చిన ఆదాయం రూ.56 కోట్లు. ఈ సమయంలోనే అప్పటి ప్రధాని బ్యాంకుల జాతీయకరణకు నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యుత్, సిమెంట్, ఉక్కు పరిశ్రమలకు నిరంతరాయ బొగ్గు సరఫరా కోసం బొగ్గు గనులను నాటి ప్రభుత్వం జాతీయకరణ చేసింది. అప్పట్లో పరిశ్రమల్లో ఇంధనంగా బొగ్గునే వినియోగించారు.
లైసెన్స్ రాజ్కు ఇలా తిలోదకాలు
1986లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి వీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్కే క్యారట్ అండ్ స్టిక్ బడ్జెట్గా పేరుంది. ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లోనే క్రమంగా లైసెన్స్ రాజ్కు తిలోదకాలిచ్చే ప్రక్రియకు విజయవంతంగా పునాది పడింది. ప్రస్తుతం నరేంద్రమోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు కోసం బీజం పడిందీ అప్పుడే. తర్వాత వెలుగు చూసిన భోపోర్స్ కుంభకోణం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వీపీ సింగ్ తొలుత జనమోర్చా.. ఆ తర్వాత జనతాదళ్ పార్టీ స్థాపించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేయలేదు.
బడా పారిశ్రామికవేత్తలకు ఇలా ముకుతాడు
భారీ లాభాలు గడిస్తున్నా చట్టం ద్రుష్టిలో పైసా లాభాలు చూపకుండా తప్పించుకుంటున్న కంపెనీలపై 1987లో నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఇలా చట్టబద్ధంగా ఆదాయం, లాభాలపై పన్ను ఎగవేతకు పాల్పడకుండా కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకురావడానికి అవసరమైన నిబంధనలు ఈ బడ్జెట్ లో చేర్చారు. నాటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించడంలోనూ ప్రభుత్వానికి ఆదాయంలో ప్రధాన వనరుగా మారిందిదే.
అంతర్జాతీయంగా భారత పారిశ్రామిక రంగం ఇలా పోటీ
ప్రస్తుత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. తొలుత సంస్కరణల రూపశిల్పి పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1991 జూలై 24న తొలి బడ్జెట్ సమర్పించిన మన్మోహన్ సింగ్ పూర్తిగా ఎగుమతులు, దిగుమతుల విధానాన్ని ప్రక్షాళన చేశారు. దిగుమతుల లైసెన్సింగ్ విధానం సరళతరం చేసి, దిగమతి తప్పనిసరి విధానాన్ని కుదించడం ద్వారా భారత పరిశ్రమ అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేందుకు మార్గం సుగమమైంది.
ఇలా ఐటీ రంగ పరిశ్రమ ఇలా అపూర్వ ప్రగతి
ప్రస్తుత బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా 2000 ఫిబ్రవరి 29వ తేదీన మిలీనియం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రధానంగా సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ హబ్ అభివ్రుద్ది చేయడం లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఎగుమతులను ప్రోత్సహిస్తూ సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలు అంతర్జాతీయంగానే భారతదేశ ఐటీ రంగ పరిశ్రమలో అపూర్వ ప్రగతి సాధించడానికి మూలంగా మారాయి.