ఫైర్స్టార్తో హవాలా కేసు దర్యాప్తుపై ఆటంకాలు: నీరవ్ ‘సౌర’ప్లాంట్ జప్తు
న్యూఢిల్లీ:
పంజాబ్
నేషనల్
బ్యాంకు
(పీఎన్బీ)లో
భారీ
కుంభకోణానికి
పాల్పడి
దాదాపు
రూ.13,600
కోట్లు
స్వాహా
చేసిన
వజ్రాల
వ్యాపారి
నీరవ్
మోదీ
ఇప్పుడు
ఏకంగా
మనీ
లాండరింగ్
కేసునే
సవాలు
చేస్తున్నాడని
ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్
(ఈడీ)
ఢిల్లీ
హైకోర్టుకు
వివరించింది.
పీఎన్బీ
కుంభకోణం
వెలుగులోకి
రావడానికి
కొన్ని
రోజుల
ముందే
కుటుంబ
సభ్యులతో
కలసి
విదేశాలకు
నీరవ్
మోదీ
పారిపోయారు.
కానీ
నీరవ్
మోదీ
తన
ఆధీనంలోని
ఫైర్స్టార్
డైమండ్
ఇంటర్నేషనల్
ప్రైవేట్
లిమిటెడ్
ద్వారా
పిటీషన్
దాఖలు
చేయించి
న్యాయ
ప్రక్రియను
నిందించేందుకు
ప్రయత్నిస్తున్నాడని
జస్టిస్
ఎస్
మురళీధర్,
జస్టిస్
ఐఎస్
మెహతాలతో
కూడిన
హైకోర్టు
ధర్మాసనానికి
ఈడీ
తరఫున
అదనపు
సొలిసిటర్
జనరల్
సందీప్
సేథీ
తెలియజేశారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నీరవ్ ‘ఫైర్ స్టార్’
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైర్స్టార్ డైమండ్ సంస్థ ఈ వ్యవహారంలో ఈడీ జరుపుతున్న దర్యాప్తుతో పాటు ఆస్తుల స్వాధీనాన్ని, అలాగే స్వాధీనం చేసుకున్న చరాస్తులను పీఎన్బీలో జమ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరింది. అయితే ఈ విషయమై ఆ సంస్థ చేసిన విజ్ఞప్తి అపరిపక్వమైనదిగా, తప్పుగా ఉన్నదని, కనుక ఆ పిటిషన్ విచారణకర్హమైనది కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ అఫిడవిట్లో పేర్కొన్నది. అంతేకాక ఫైర్స్టార్ పిటిషన్ను న్యాయస్థానం అనుమతిస్తే పీఎన్బీ కుంభకోణంపై తాము జరుపుతున్న దర్యాప్తునకు తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉన్నదని ఈడీ ఆందోళన వ్యక్తం చేసింది.
పీఎన్బీ కేసులో నీరవ్ సహాయ నిరాకరణ: ఈడీ
పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ ఈ పిటీషన్ దాఖలు చేసిన ఫైర్స్టార్ డైమండ్ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కూడా పదేపదే సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు సహకరించడం లేదని ఈడీ తెలిపింది అసలు విచారణలో పాలుపంచుకోవాలన్న ఉద్దేశ్యమే నీరవ్కు లేదని ఆయన రాసిన లేఖలను బట్టి స్పష్టమవుతున్నదన్నది. కరడు గట్టిన ఆర్థిక నేరగాడైన నీరవ్ న్యాయస్థానం ముందుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని పేర్కొన్నది. దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు నిరాకరిస్తున్నాడని, కనుక ఫైర్స్టార్ పిటిషన్ను డిస్మిస్ చేసేందుకు ఇంతకు మించిన కారణాలు అవసరం లేదని ఈడీ తన అఫిడవిడ్లో పేర్కొంది.
నీరవ్ ‘సోలార్ ప్లాంట్’ విలువ రూ.70 కోట్లు
పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు నీరవ్మోదీకి ఈడీ మరోషాక్ ఇచ్చింది. అహ్మద్నగర్లోని సోలార్ ప్లాంట్ను, వందల ఎకరాల భూమిని తాజాగా సీజ్ చేసింది. నీరవ్ మోదీకి చెందిన సౌర విద్యుత్ ప్లాంట్, 134 ఎకరాల భూమిని ధృవీకృత ఆస్తులుగా స్వాధీనం చేసుకుంది. ఈ మెగా స్కాంలో ఇప్పటికే మోదీకి చెందిన 21 రకాల స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.523 కోట్లు. కాగా అహ్మద్నగర్ జిల్లా కర్జత్లోగల 134 ఎకరాల స్థలం ఉండగా, 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ విలువ రూ.70 కోట్లుగా ఉన్నట్టు ఈడీ తెలిపింది.
బ్యాంకుల కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు కావాలి
పీఎన్బీతో పాటు మరికొన్ని ఇతర బ్యాంకుల్లో ఇటీవల జరిగిన కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని యూఎఫ్బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ‘దేశం నుంచి పారిపోయిన ఇద్దరు వజ్రాల వ్యాపారులు (నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ) పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడి దాదాపు రూ.13 వేల కోట్లు స్వాహా చేసిన ఉదంతంపై జేపీసీతో సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 1992లో హర్షద్ మెహతా కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పీఎన్బీ కుంభకోణంపై కూడా జేపీసీతో దర్యాప్తు జరిపించాలి' అని యూఎఫ్బీయూ పశ్చిమ బెంగాల్ కన్వీనర్ సిద్ధార్థ్ ఖాన్ అన్నారు.
బ్యాంకులను మొండి బకాయిలు పీడిస్తున్నాయని యూఎఫ్బీయూ ఆందోళన
బ్యాంకులను సరైన రీతిలో పర్యవేక్షించడంలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విఫలమైందని, అందుకే ఇటువంటి కుంభకోణాలు తరచుగా జరుగుతున్నాయని, ఈ కుంభకోణాలకు బ్యాంకుల్లోని కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని యూఎఫ్బీయూ పశ్చిమ బెంగాల్ కన్వీనర్ సిద్ధార్థ్ ఖాన్ ఆరోపించారు. కుంభకోణాలతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని పట్టిపీడిస్తున్న మొండి బకాయిలు, ఇతర సమస్యలపై యూఎఫ్బీయూలోని మొత్తం తొమ్మిది కార్మిక సంఘాలు బుధవారం న్యూఢిల్లీలో పార్లమెంట్ భవనం ఎదుట ర్యాలీ నిర్వహించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్ఆర్డీఐ బిల్లు-2017ను కూడా యూఎఫ్బీయూ వ్యతిరేకిస్తున్నది. బెయిల్ ఇన్ క్లాజుతో కూడిన ఈ బిల్లు వలన బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ముకు ముప్పు వాటిల్లడం ఖాయమని యూఎఫ్బీయూ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.