శుభవార్త: విమాన టిక్కెట్టు రద్దు చేసుకొంటే ఇక నుండి ఉచితమే
న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి ఇక నుండి ఇబ్బందులు ఉండవు. భారం కూడ ఉండదని కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ ప్రకటించింది. విమాన టిక్కెట్లను బుక్ చేసుకొన్న 24 గంటల్లోపుగా క్యాన్సిల్ చేసుకొంటే ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తేల్చి చెప్పింది.
ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం వెల్లడించారు. కొత్తగా ఎయిర్ సేవా డిజి యాత్రా పథకాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. ప్రత్యేక అవసరాలతో ప్రయాణించేవారికోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
విమాన ఆలస్యంలో ఎయిర్లైన్స్ తప్పు ఉంటే విమానయాన సంస్థ పరిహారం చెల్లించాలని భావిస్తోంది. విమానం నాలుగు గంటలకు మించి ఆలస్యమైతే పూర్తి టిక్కెట్టు డబ్బులను ప్రయాణీకుడికి చెల్లిస్తారు.
ఒక్కరోజు ఆలస్యమైతే ప్రయాణీకుడికి హోటల్ లో బసతో పాటు ఇతర సౌకర్యాలను కూడ కల్పించనున్నారు. టికెట్ బుకింగ్నకు ఆధార్ తప్పనిసరి కాదు. అయితే డిజీ యాత్రలో నమోదు సమయంలో మాత్రమే ఆధార్ అవసరమవుతుందనీ, డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టామని జయంత్ సిన్హా తెలిపారు.
అయితే విమాన టిక్కెట్టు బుక్ చేసుకొన్న తర్వాత క్యాన్సిల్ చేసుకొంటే ఇప్పుడు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో మాత్రం టిక్కెట్టును 24 గంటల్లోపుగా క్యాన్సిల్ చేసుకొంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.