యంగ్ తరంగ్ ‘పేటీఎం’ ఫౌండర్.. ఓల్డెస్ట్ అల్కెమ్ ఎమిరస్ చైర్మన్ సంప్రదా సింగ్
న్యూఢిల్లీ: 'పేటీఎం' వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (39) ఫోర్బ్స్ ఫార్చ్యూన్స్ జాబితాలో యువ భారతీయ కుబేరుడిగా నిలిచారు. అండర్ - 40 లీగ్లో యువ కుబేరుడిగా నిలిచిన విజయ్ శేఖర్ శర్మ ఆస్తి రూ.1700 కోట్లు. ఫోర్బ్స్ జాబితాలో 1394వ స్థానం దక్కించుకున్నారు. మరోవైపు అల్కెమ్ లేబరేటరీస్ ఎమిరస్ చైర్మన్ సంప్రదా సింగ్ (92) అత్యంత వృద్ధ కుబేరుడిగా చోటు సంపాదించు కున్నారు. మొబైల్ వాలెట్ 'పేటీఎం'ను విజయ్ శేఖర్ శర్మ 2011లో స్థాపించారు. తర్వాత దాన్ని 'ఈ - కామర్స్' బిజినెస్ వేదికగా 'పేటీఎం మాల్', పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.
రోజూ 70 లక్షల మంది లావాదేవీలు
2016 నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థల్లో ‘పేటీఎం' ఒకటి. ఇప్పటివరకు 25 కోట్ల మంది వినియోగదారులు తమ పేర్లు నమోదు చేసుకోగా, రోజూ 70 లక్షల మంది వినియోగదారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ‘పేటీఎం'లో విజయ్ శేఖర్ శర్మకు 16 శాతం వాటా ఉంది. దాని విలువ 9.4 బిలియన్ల డాలర్లు అని ఫోర్బ్స్ పేర్కొన్నది.
యువకుల్లో 34 మంది కుబేరులు స్వీయ పారిశ్రామికవేత్తలు
ఫోర్బ్స్ ప్రకటించిన 2208 కుబేరుల జాబితాలో కేవలం 63 మంది మాత్రం 40 ఏళ్లలోపు యువకులు కాగా, 34 మంది స్వీయ పారిశ్రామికవేత్తలు. ప్రపంచంలోని సదరు 63 మంది కుబేరులు 265 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. అది గతేడాది 208 బిలియన్ డాలర్లు మాత్రమే మరి.
139 మిలియన్ డాలర్లకు అల్ కెమ్ నికర లాభాలు
ఇక 92 ఏళ్ల సంప్రదా సింగ్.. అల్ కెమ్ ల్యాబోరేటరీస్ చైర్మన్ ఎమిరస్. భారతీయ కుబేరుల్లో వృద్ధులు. ఆయన ఆస్థి 1.2 బిలియన్ల డాలర్లు ఉంటుంది. ఫోర్బ్స్ జాబితాలో 1867వ చోటు దక్కించుకున్నారు. సంప్రదాసింగ్ ‘అల్కెమ్' ల్యాబొరేటరీస్ సంస్థను 45 ఏళ్ల క్రితం స్థాపించారు. గతేడాది మార్చితో ముగిసే నాటికి అల్ కెమ్ సంస్థ నికర లాభాలు 139 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నికర ఆదాయం 913 మిలియన్ల డాలర్లుగా ఉన్నది.
పతంజలి లావాదేవీల విలువ 6.3 బిలియన్ల డాలర్లు
యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన ‘పతంజలి' సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలక్రుష్ణ ఈ ఏడాది ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 274వ స్థానం పొందారు. గతేడాది భారతీయ కుబేరుల్లో 19వ స్తానం సొందారు. ‘పతంజలి' స్టోర్స్లో బాలక్రుష్ణ వాటా 98.6 శాతం. పతంజలి ఆయుర్వేద్ వ్యాపార లావాదేవీల విలువ 6.3 బిలియన్ల డాలర్లు ఉంటుంది.
భారతీయ మహిళల్లో అగ్రగామిగా కిరణ్ మజుందార్
ప్రపంచ కుబేరుల జాబితాలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక స్థాయిలో 256 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. ఇందులో ఎనిమిది మంది భారతీయ మహిళలకూ చోటు దక్కింది. ఈ టాప్-2,208 బిలియనీర్ల జాబితాలోని మొత్తం మహిళల సంపద గతేడాదితో పోల్చితే 20 శాతం పెరిగి లక్ష కోట్ల డాలర్లను చేరింది. ఈ శ్రేణిలో భారత్లో అగ్రగామి మహిళా సంపన్నురాలిగా కిరణ్ మజుందార్ షా ఉన్నారు. భారతీయుల్లో సావిత్రి జిందాల్, కుటుంబం 8.8 బిలియన్ డాలర్లతో ముందుండగా, 3.6 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో కిరణ్ మజుందార్ షా ఉన్నారు. కాగా, యెస్ బ్యాంకుకు చెందిన మధు కపూర్ ఈసారి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలోకి కొత్తగా రాగా, ఇంజినీరింగ్ సంస్థ థర్మాక్స్కు చెందిన అను అగా రెండేండ్ల తర్వాత మళ్లీ చోటు దక్కించుకున్నది.
రెండో స్థానంలో ఫ్రాంకోయిస్ బెట్టన్ కోర్ట్ మేయర్స్ ఫ్యామిలీ
ఇక ప్రపంచ స్థాయిలో 46 బిలియన్ డాలర్లతో వాల్మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ ఏకైక కూతురు అలీస్ వాల్టన్.. మహిళా ధనవంతులలో అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం జాబితాలో ఈమెది 16వ స్థానం. అలాగే లోరియల్ సంస్థకు చెందిన ఫ్రాంకోయిస్ బెట్టన్కోర్ట్ మేయర్స్ కుటుంబం 42.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, 25 బిలియన్ డాలర్లతో బీఎండబ్ల్యూకు చెందిన సుసన్నే క్లట్టెన్ మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం జాబితాలో వీరు 18, 32వ స్థానాల్లో నిలిచారు. కాగా, ఈసారి స్వశక్తితో ఒంటరిగా ఎదిగి ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న మహిళామణుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగబాకడం విశేషం. నిరుడు 56 మంది ఉంటే.. ఈ యేడు 72 మంది ఉన్నారు.
భారత్ జాబితాలో కొత్తగా 18 మంది కుబేరులు ఇలా
రూ.12,600 కోట్ల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. ఆయనతోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్టోఫెల్ వైస్ పాపాజాన్స్ పిజ్జా వ్యవస్థాపకుడు జాన్ స్కానట్టర్, సౌదీ అరేబియా యువ రాజు అల్వాలీద్ బిన్ తలాల్ అల్ సౌదీ పేర్లు తొలగించారు. గతేడాదితో పోలిస్తే భారతదేశంలో కుబేరుల జాబితాలో 18 మంది కుబేరుల సంఖ్య పెరిగి, 119 మందికి చేరుకున్నది.