నో డౌట్ కోహ్లీ మా ప్రచారకర్తే: పీఎన్బీ.. బ్యాంకుల ప్రైవేటీకరణకు సీఐఐ సుద్దులు
న్యూఢిల్లీ: తమ బ్యాంక్ ప్రచారకర్తగా క్రికెట్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైదొలిగారన్న వార్తలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కొట్టి పారేసింది. వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ ఆధ్వర్యంలో తమ బ్యాంకులో రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నేపథ్యంలో కోహ్లీ ప్రచారకర్తగా తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారని వచ్చిన వార్తలను పీఎన్బీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన తమ ప్రచారకర్త అని స్పష్టం చేసింది.
మీడియాలోవచ్చిన వార్తలు పూర్తిగా తప్పని, అవాస్తవమని పేర్కొన్నది. అలాగే నీరవ్ మోదీ, ఆయన సంబంధిత వ్యక్తులపై ఆడిటింగ్ దర్యాప్తు కోసం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ను కోరనున్నట్లు వచ్చిన వార్తలను పీఎన్బీ తోసిపుచ్చింది.
సోషల్ మీడియాలో విత్ డ్రాయల్స్పై ఇలా వదంతులు
రోజువారీ నగదు విత్ డ్రాయల్స్ పైనా ఎటువంటి ఆంక్షలు విధించలేదని, సాధారణ కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయని స్పష్టం చేసింది. ప్రతిరోజూ పీఎన్బీ బ్యాంకు పరిధిలో నగదు విత్ డ్రాయల్స్ ను రూ.3000లకే పరిమితం చేసినట్లు సోషల్ మీడియాలో వదంతులు షికారు చేశాయి. ఖాతాదారుల విత్ డ్రాయల్స్ పైన ఎటువంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. తమ బ్యాంకులో ఇటీవల 18 వేల మంది ఉద్యోగులను బదిలీ చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించిన పీఎన్బీ కేవలం 1415 మందిని మాత్రమే బదిలో చేశామని వివరణ ఇచ్చింది. తమ బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నదని పేర్కొన్నది.
బ్యాంకుల్లో పర్యవేక్షణ, నియంత్రణ బలోపేతానికి సీఐఐ డిమాండ్
ఇదిలా ఉంటే బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణపైనా కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కూడా సూచనలు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసి. ప్రైవేట్ శక్తుల భాగస్వామ్యాన్ని 33 శాతం నుంచి క్రమంగా పెంచాలని పేర్కొంది. బ్యాంకు లావాదేవీల్లో అనైతికతలను ఖండించింది. ప్రస్తుతం పీఎన్బీలో ఆర్థిక మోసానికి బ్యాంకు స్థాయిలో పర్యవేక్షణ, నియంత్రణలో లోపాలే కారణమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. బ్యాంకు సిబ్బంది మద్దతుతోనే ఇటువంటి అనైతిక కార్యకలాపాలు సాగాయన్నారు. ఇప్పటికైన బ్యాంకింగ్ యాజమాన్యంలో నైపుణ్యతను ముందుకు తేవాలని కోరారు. అన్ని స్థాయిలో పర్యవేక్షణ, నియంత్రణ పద్దతులను మరింత పెంచాలని అభ్యర్థించారు.
నీరవ్, మెహుల్ చోక్సీల ఆస్తులపై ఈడీ ఇలా
నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ ఆదాయం పన్నుశాఖకు సమర్పించిన, చెల్లించిన ఆదాయం పన్ను లెక్కల ప్రకారం వీళ్ల ఆస్తుల విలువ రూ.4000 కోట్ల వరకు ఉండొచ్చని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భావిస్తోంది. వీటిని జప్తు చేయడం వల్ల ఆ మేరకు బకాయిను వసూలు చేసే అవకాశం ఉంటుందని అనుకుంటోంది. వీటికి తోడు ఈడీ జప్తుచేసిన వజ్రాలు, విలువైన రాళ్ల విలువ రూ.5,186 కోట్ల వరకు ఉండొచ్చు. వీటిని విలువ లెక్కించే నిమిత్తం ఇప్పటికే ప్రయోగశాలకు కూడా ఈడీ పంపింది.
మెహుల్ చోక్సీ ఆస్తులన్నీ డొల్ల కంపెనీల పేరిటే రికార్డులు
నీరవ్కు ముంబయి, సూరత్, పుణె, నాసిక్లో 25 వరకు స్థిరాస్తులు ఉండొచ్చని ఆదాయపు పన్ను శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటి విలువ రూ.1,500 కోట్లకు మించకపోవచ్చు. అలాగే మెహుల్ ఛోక్సికి నాలుగు సెజులు, రెండు మాల్లు, ఆరు ఫ్లాటులు ఉన్నాయి. వీటి విలువ రూ.2,500 కోట్లకు పైనే. ఛోక్సికి చెందిన ఆస్తుల వివరాలు కంపెనీల పద్దు పుస్తకాల్లో ఉన్నప్పటికీ, డొల్ల కంపెనీల పేరుతో ఇవి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఆదాయం లేదనే సాకుతో 2012లో ఇలా మూసివేత
నీరవ్ మోదీ స్థాపించిన తొమ్మిది కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. రెండేళ్లలోనే వాటిని మూసేశారని తెలుస్తోంది.2010లో ఈ తొమ్మిది కంపెనీలు ఏర్పాటయ్యాయి. 2012లో వీటిని మూసేశారు. ఈ 9 కంపెనీలకు నీరవ్ మోదీ సోదరుడు నీషల్ మోదీ డైరెక్టరుగా ఉన్నారు. రూ.11,400 కోట్ల కుంభకోణంలో నిందితుడిగా ఈయన పేరును కూడా సీబీఐ చేర్చింది. మూసివేతకు ఈ కంపెనీలన్నీ ఒకే కారణం చూపాయి. ‘స్థిరమైన వాణిజ్య కార్యకలాపాలు లేకపోవడంతో, ఆదాయాన్ని ఆర్జించే స్థితిలో లేం' అని ఈ కంపెనీల బోర్డు తీర్మానాల్లో ఉంది. దీనిపై నీరవ్ మోదీ, ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ నుంచి ఎలాంటి స్పందన లేదు.