పీఎన్బీలో నీరవ్ ప్లస్ మెహుల్ చోక్సీ మోసం.. రూ. 13 వేల కోట్ల పైనే?
ముంబై/ న్యూఢిల్లీ: అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పీఎన్బీ కుంభకోణంలో మరిన్ని షాగింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న మోసాల విలువ మరింత మరింత విస్తరిస్తోంది. తాజాగా పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న గీతాంజలి ప్రమోటర్ మెహుల్ చోక్సీపై సీబీఐ వద్ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మరో ఫిర్యాదును నమోదు చేసింది. అదనంగా మరో రూ.942 కోట్ల మోసాన్ని గుర్తించినట్టు తెలిపింది.
దీంతో గీతాంజలి జెమ్స్ మొత్తం అక్రమాల విలువ రూ.7000 కోట్లకుపై మాటే. మొదట్లో 12, 700 కోట్లకు పైగా డైమండ్ వ్యాపారి నీరవ్మోదీ, చోక్సీ జోడీ ముంచేసినట్టుగా పీఎన్బీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బ్యాంకు తెలిపిన సమాచారం ప్రకారం ఈ కుంభకోణం విలువ రూ. 13, 640 కోట్లకు చేరింది. తాజా ఫిర్యాదుతో నీరవ్ మోదీ గేట్ స్కాం మొత్తం మోసం విలువ రూ. 20 వేల కోట్లను దాటేసిందని సమాచారం.
కానీ షరతులు వర్తిస్తాయన్న పీఎన్బీ
ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ అందుకు కొన్ని షరతులు పెట్టినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని ప్రచురించింది. పీఎన్బీ నుంచి తీసుకున్న మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ)లతో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తదితరులు విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రుణాల మొత్తం విలువ రూ.12వేల కోట్ల పైనే. అయితే.. నీరవ్ తీసుకున్న రుణాలను పీఎన్బీనే చెల్లించాల్సి ఉంది. తొలుత వీటి మొత్తాన్ని చెల్లించేందుకు పీఎన్బీ అంగీకరించలేదు. తర్వాత కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. ఇప్పుడు బకాయిలు చెల్లిస్తాం, కానీ అందుకు కొన్ని షరతులు ఉన్నాయని పీఎన్బీ అధికారులు చెప్పినట్లు ఆంగ్ల మీడియా తన కథనంలో పేర్కొంది.
నీరవ్కు రుణాలు ఇచ్చినట్లు బ్యాంకులు రుజువు చేసుకోవాలి
‘మార్చి చివరి నాటికి పీఎన్బీ బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఆయా బ్యాంకులు నీరవ్కు రుణాలు ఇచ్చినట్లు విచారణ అధికారుల ముందు రుజువు చేయాల్సి ఉంది. ఒకవేళ రుణాలు ఇచ్చినట్లు రుజువైతే అప్పుడే బకాయిలు చెల్లిస్తాం' అని పీఎన్బీ షరతు పెట్టినట్లు సమాచారం. ఈ విషయంపై పీఎన్బీ అధికారులను ప్రశ్నించగా.. వారు స్పందించలేదు. మార్చి చివరి నాటికి పీఎన్బీ బ్యాంకులకు రూ.6వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో పాటు యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులకు పీఎన్బీ బకాయిలు పడింది.
విదేశాల్లోనూ బిజినెస్లు ప్యాకప్
ఇండియా మోస్ట్ వాంటెడ్ వజాల వ్యాపారి నీరవ్ మోదీ బిచాణా ఎత్తేయబోతున్నట్టు తెలుస్తోంది. హాంకాంగ్ వ్యాపారాల నుంచి నీరవ్ మోదీ వైదొలుగుతున్నట్టు ఒక ఆంగ్ల వార్తా వెబ్ సైట్ బహిర్గతం పేర్కొంది. నాన్ హాంకాంగ్ కంపెనీగా హాంకాంగ్ అథారిటీల వద్ద రిజిస్ట్రర్ అయిన నీరవ్మోదీ ఫైర్స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీని నీరవ్ ఎత్తేసినట్టు వెల్లడైంది. ఈ కంపెనీ డిసెంబర్ 12వ తేదీనే వ్యాపారాల నుంచి వైదొలిగే నోటీసు ఇచ్చిందని, ఈ ఏడాది జనవరి 19న హాంకాంగ్ కంపెనీల రిజిస్ట్రరీ దీన్ని నోటిఫై చేసినట్టు తెలిసింది. భారత్లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్మోదీ విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే. ఆయన విచారణ కోసం ఇక్కడికి రావడానికి విదేశ వ్యాపారాలను సాకుగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అక్కడికి వెళ్లకముందే హాంకాంగ్ బిజినెస్లను నీరవ్ మూసేస్తున్నట్టు తెలిసింది.
హంకాంగ్ చట్టాల్లో నిబంధనలు ఇలా కఠినతరం
నీరవ్కు చెందిన ఇతర హాంకాంగ్ కంపెనీలు నీరవ్ మోదీ లిమిటెడ్, నీరవ్ మోదీ హెచ్కే లిమిటెడ్, ఫైర్స్టార్ డైమాండ్ లిమిటెడ్, ఫైర్స్టార్ హోల్డిండ్ లిమిటెడ్లకు నీరవ్ మోదీ డైరెక్టర్గా కానీ లేదా ఆధిపత్య హక్కులు కానీ కలిగి లేరు. ఈ కంపెనీలన్నింటికీ ఒకే హాంకాంగ్ అడ్రస్ ఉంది. అది 21 - 23, 2 / ఎఫ్ న్యూ హెన్రీ హౌజ్, 10 ఐస్ హౌజ్ స్ట్రీట్, సెంట్రల్ హాంకాంగ్గా ఉంది. వీటిని కూడా త్వరలోనే సీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. వీటి ద్వారా వచ్చిన నగదును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా స్పందించడానికి హాంకాంగ్ కంపెనీ రిజిస్ట్రరీ అధికారులు స్పందించలేదు. ఇటీవల హాంకాంగ్ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా హాంకాంగ్లో షెల్ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేయడం కఠినతరమవుతోంది. అక్రమ నగదును దాచిపెట్టడం కూడా కష్టంగా మారుతోంది.