పిఎన్బి స్కామ్: నీరవ్ మోడీ ఇళ్లూ ఆఫీసులపై ఈడి సోదాలు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి)లో చోటు చేసుకున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. నీరవ్ మోడీ ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
నీరవ్ మోడీకి చెందిన 12 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్ల తెలుస్తోంది. కుంభకోణానికి సంబంధించి ఈడి ఇదివరకే నీరవ్ మోడీపై, తదితరులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.
నీరవ్ మోడీ ప్రస్తుతం ఎక్కడున్నారనేది అంతు చిక్కడం లేదు. నిరవ్ మోడీ షోరూంలోనూ ముంబైలోని కళా ఘోడా కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ముంబైలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్యాలయాల్లో సైతం ఈడి అధికారులు సోదాలు చేపట్టారు.
కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు 8.47 శాతం పడిపోయాయి. నక్షత్ర, గీతాంజలి, గిన్నీ జువెల్లర్స్ ట్రేడింగ్ విధానంపై సెబీ విచారణ జరుపుతోంది.