పీఎన్బీ స్కాం: ఇలా బయటపడింది.. కుప్పకూలిన బ్యాంక్ షేరు, ఇక ఇప్పుడేం జరుగుతుంది?
Recommended Video
ముంబై: ఇప్పటికే మొండి బకాయిలతో అస్తవ్యస్థంగా మారిన భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక పరిస్థితిపై తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ముంబై బ్రాంచిలో చోటుచేసుకున్న రూ.11,400 కోట్ల కుంభకోణం.. 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు'గా కనిపిస్తోంది.
చదవండి: తప్పు మాదే అన్నా ఒప్పుకుంటాం.. గుర్తించలేకపోయాం: పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండోదైన పీఎన్బీ చరిత్రను ఈ కుంభకోణం ఒక్కసారిగా తలకిందులు చేసింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మరో ఆభరణాల కంపెనీ సంయుక్తంగా మోసపూరిత లావాదేవీలకు పాల్పడి ఈ బ్యాంకుకు శఠగోపం పెట్టారు.
పిఎన్బి స్కామ్: విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ
ఈ అక్రమ లావాదేవీలలో బ్యాంకు ముంబై బ్రాంచి ఉద్యోగుల ప్రమేయం కూడా ఉండడంతో ఈ కుంభకోణానికి బాధ్యులను చేస్తూ బ్యాంక్ శాఖ డిప్యూటీ మేనేజర్తో సహా 10 మంది ఉద్యోగులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పటికే వేటు పడింది.
గుర్తించలేకపోవడం మా తప్పే.. ఒప్పుకుంటాం: పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా
ఒక ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుండగానే...
పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మోసాలపై సీబీఐకి ఫిర్యాదు చేయడం 10 రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 5న నీరవ్ మోడీ తమ బ్యాంకును రూ.280 కోట్ల మేర మోసగించినట్లు బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతుండగా అదే బ్యాంకు ముంబై బ్రాంచిలో జరిగిన మరో అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిజానికి నీరవ్ మోడీ మోసపూరిత లావాదేవీలపై పంజాబ్ నేషనల్ బ్యాంకు జనవరి 28నే సీబీఐకి ఫిర్యాదు చేసింది. ముంబై బ్రాడీహౌస్లోని తమ మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో కొన్ని మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ లభించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది.
పిఎన్బి స్కామ్: నీరవ్ మోడీ ఇళ్లూ ఆఫీసులపై ఈడి సోదాలు
కుంభకోణం ఎలా జరిగిందంటే...
జనవరి 16న డైమండ్ ఆర్ యుఎస్, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ అనే మూడు సంస్థలు తమకు బయర్స్ క్రెడిట్ కావాలంటూ ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక శాఖ అధికారులను కోరాయి. విదేశీ సరఫరాదారుల నుంచి సరుకు వస్తోందని తెలిపే కొన్ని పాత్రాలు చూపించి, వారికి చెల్లించేందుకు అవసరమైన రుణం కోసం లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్(ఎల్ఓయూ) కావాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సంస్థలు నీరవ్ మోడీ, ఆయన సోదరుడు నిశాల్ మోడీ, నీరవ్ భార్య అమీ నీరవ్ మోడీ, మరో వ్యాపార భాగస్వామి మెహుల్ చినూభాయ్ చోక్సీకి సంబంధించినవి.
ఏమిటీ బయ్యర్స్ క్రెడిట్?
బయ్యర్స్ క్రెడిట్ అనేది ఒక స్వల్పకాలిక రుణ సదుపాయం. విదేశాల నుంచి సరుకు, సేవలు దిగుమతి చేసుకునే వ్యాపారులు, సంస్థలకు ఈ తరహా రుణ సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తుంటాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రుణాలు సర్వసాధారణమే. ఏ దేశం నుంచి ఏ వ్యాపారి, సంస్థ సరుకు లేదా సేవలు ఎగుమతి చేస్తాయో వారికి దిగుమతి చేసుకునే వారి తరుపున ఇచ్చే గ్యారెంటీ అన్నమాట.
100 శాతం క్యాష్ మార్జిన్ అడిగిన అధికారులు...
నీరవ్ మోడీ తదితరులకు చెందిన సంస్థలు ఎప్పుడైతే బయ్యర్స్ క్రెడిట్ కోసం లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్స్ అడిగాయో అప్పుడే బ్యాంకు అధికారులు అందుకు 100 శాతం క్యాష్ మార్జిన్ సమర్పించాలని సూచించారు. దీనికి ఆ మూడు సంస్థలు.. ‘అదేం అవసరం లేదు, మేం గతంలో క్యాష్ మార్జిన్ ఏమీ లేకుండానే లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకున్నాం..' అంటూ నమ్మబలికాయి. అయితే ఆయా సంస్థలకు రుణ పరిమితికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడం బ్యాంకు అధికారులకు అనుమానం కలిగించింది.
లోతుగా శోధించడంతో వెలుగులోకి...
దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులు నీరవ్ మోడీ తదితరుల సంస్థలకు రుణ మంజూరుకు సంబంధించి మరింత లోతుగా శోధించారు. దీంతో గతంలోనూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా ఇద్దరు బ్యాంకు ఉద్యుగులు వారి సంస్థలకు లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ ఇచ్చిన విషయం బయటపడింది. ఈ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు కూడా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. చేసిన పాడుపని ఎక్కడా బ్యాంకు రికార్డుల్లోకి రాకుండా చూసుకున్నారు. పీఎన్బీ అధికారులతో కుమ్మక్కయి ఇలా తీసుకున్న ఎల్ఒయుల ఆధారంగా ఈ డైమండ్ వ్యాపార సంస్థలు విదేశాల్లోని ఇతర బ్యాంకుల నుంచీ పెద్ద మొత్తంలో అడ్వాన్స్లు తీసుకునేవని తెలుస్తోంది.
‘స్విఫ్ట్’ మెసేజింగ్ సిస్టం ద్వారా...
బ్యాంకుల అంతర్గతంగా వినియోగించుకునే ‘స్విఫ్ట్' అనే మెసేజింగ్ సిస్టంను పీఎన్బీ బ్యాంకు ఉద్యోగులు తమ అక్రమ లావాదేవీలకు ఉపయోగించుకున్నారు. ఈ విధానంలో ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు సమాచారం చేరవేయొచ్చు. ఆ ప్రకారం.. నీరవ్ మోడీ తదితరుల సంస్థలకు బయ్యర్స్ క్రెడిట్ పెంచినట్లుగా విదేశాల్లోని భారతీయ బ్యాంకులకు సమాచారం అందజేశారు. ఆ ప్రకారం అక్కడి బ్యాంకులు ఎగుమతిదారుకు డబ్బులు అందజేశాయి. ఇలా హాంకాంగ్లోని అలహాబాద్ బ్యాంకుకు ఐదు మెసేజ్లు, యాక్సిస్ బ్యాంకుకు మూడు మెసేజ్లు అందాయి. కానీ ఈ మెసేజ్లు పంపినట్లు మాత్రం పీఎన్బీ బ్యాంకు రికార్డుల్లో ఎక్కడా లేవు.
ఇక ఇప్పుడేం జరుగుతుందంటే...
తాజాగా వెలుగులోకి వచ్చిన కుంభకోణం విలువ ఎంతో తెలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుదేలైపోతోంది. ఎందుకంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఆ బ్యాంకు ఆర్జించిన రూ.1,324 కోట్ల నికర లాభానికి ఎనిమిదిరెట్లు ఎక్కువ ఈ స్కాం విలువ. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణం నేపథ్యంలో ఇతర బ్యాంకులన్నీ జాగ్రత్త పడతాయి. దీని వల్ల నిజాయితీపరులైన వ్యాపారులు, సంస్థలకు కూడా కొంత కాలం వరకు బయర్స్ క్రెడిట్ లభించదు. ‘అయితే ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సినంత పెద్ద విషయమేం కాదు..' అని కేంద్ర ఆర్థిక సేవల విభాగం సంయుక్త కార్యదర్శి లోక్ రంజన్ వ్యాఖ్యానించారు.
రంగంలోకి సీబీఐ, ఈడీ, సెబీ...
మరోవైపు ఈ భారీ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఇలా మోసపూరితంగా సంపాదించిన నిధుల ద్వారా వీరు అక్రమంగా ఏమైనా ఆస్తులు, నల్లధనం పోగు చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేయబోతోంది. వివిధ బ్యాంకులతో ఈ సంస్థలకు ఉన్న అవగాహన, చివరకు ఈ డబ్బు ఎక్కడకు చేరిందనే విషయాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయి. లిస్టెడ్ బ్యాంకులు, జ్యూయలరీ సంస్థలు ఈ కుంభకోణానికి సంబంధించి వెల్లడించాల్సిన విషయాల విషయంలో ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాయా? అనే విషయంపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ' కూడా దర్యాప్తునకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ఈ కంపెనీల షేర్ల లావాదేవీల వివరాలనూ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు పరిశీలించే అవకాశం ఉంది. ఇందులో ఇప్పటికే కొన్ని కంపెనీల ఉన్నతాధికారులు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కుప్పకూలిన బ్యాంక్ షేర్లు...
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ.11,400 కోట్ల కుంభకోణం జరిగిందనే వార్త దావానలంలా వ్యాపించడం, బ్యాంకే నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఆ బ్యాంకు షేర్లు కుప్పకూలిపోయాయి. బిఎ్సఇలో ఈ షేరు విలువ 9.81 శాతం నష్టపోయి రూ.145.80 వద్ద ముగిసింది. దీంతో ఒక్కరోజులోనే ఈ బ్యాంక్ షేర్లలో మదుపు చేసిన మదుపరుల సంపద విలువ రూ.3,844 కోట్లు మేర హరించుకుపోయింది. మరోవైపు ఇచ్చిన రుణాలు వసూలుకాక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్రం గత అక్బోబరులోనే రూ.2.11 లక్షల కోట్ల క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ప్రకటించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ భారీ కుంభకోణం వెలుగుచూడడం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయొచ్చు.